
హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అతనితో పాటుగా భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ అమ్రపాలిపై ఫిర్యాదు చేశారు. మహేంద్రసింగ్ ధోనీ అమ్రపాలి అనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు.
బ్రాండు అంబాసిడర్గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ ఫ్రాంకోయిస్ డు ప్లెస్సీలు కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు.
బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని అన్నారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు.
దీంతో, 2016 ఏప్రిల్లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. సదరు సంస్థ 2016 సంవత్సరంలో 2011 ప్రపంచ కప్ గెలిచనందుకు గాను జట్టులోని ప్రతి క్రికెటర్ కు రూ.9కోట్ల విలువైన విల్లాను బహుమతిగా ఇస్తామని ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ధోనీకి, ఇతర క్రికెటర్లకు 1690 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాన్ని ఇచ్చింది.