విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత నెలరోజులపైగా క్రికెట్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఆసియా కప్లో మళ్లీ జట్టుతో కలిశాడు. ఆ టోర్నీలో ఫర్వాలేదనిపించిన అతను.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినా.. అప్పటికే భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ ఆ ఇన్నింగ్స్ చూసిన వాళ్లందరూ కూడా తమకు మునుపటి కోహ్లీ తిరిగొస్తున్న పోలికలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
టీ20 ప్రపంచకప్లో కూడా అదే జోరు..
తనపై అందరూ పెట్టుకున్న అంచనాలను అందుకున్న కోహ్లీ.. టీ20 ప్రపంచకప్లో కూడా అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు ఒంటి చేత్తో విజయాన్నందించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్పై కూడా రాణించాడు. సౌతాఫ్రికా మ్యాచ్లో తొందరపాటుతో అవుటైనా.. మళ్లీ బంగ్లాదేశ్పై 44 బంతుల్లో 64 పరుగులతో మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికే ఈ మ్యాచ్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.
జయవర్దనే రికార్డు బద్దలు..
బంగ్లాపై హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా మహేలయ జయవర్దనే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తన కెరీర్లో 31 టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన జయవర్దనే.. 39.07 సగటు, 134.74 స్ట్రైక్రేటుతో 1016 పరుగులు చేశాడు. అయితే బంగ్లాదేశ్పై 64 పరుగులు చేసిన కోహ్లీ.. కేవలం 25 మ్యాచుల్లోనే 1065 పరుగులతో నిలిచాడు.
మహేల ఏమన్నాడంటే?
తన రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడంపై శ్రీలంక లెజెండ్ మహేల జయవర్దనే స్పందించాడు. ఐసీసీ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో విడుదల చేసిన వీడియోలో జయవర్దనే మాట్లాడుతూ.. 'రికార్డులు ఉండేది బద్దలవడానికే. నా రికార్డు కూడా ఎవరో ఒకరు బద్దలు కొట్టాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు బద్దలు కొట్టావ్. కంగ్రాచ్యులేషన్స్ విరాట్. నువ్వు మొదటి నుంచి గొప్ప యోధుడివి. ఫామ్ తాత్కాలికం కానీ, క్లాస్ మాత్రమే శాశ్వతం' అన్నాడు.