
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. హై క్యాచ్ పట్టే క్రమంలో కరుణరత్నే మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు. గాలే గ్లాడియేటర్స్, కెండీ ఫాల్కన్స్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా.. కార్లెస్ బ్రాత్వైట్ బౌలింగ్లో ఫెర్నాండో భారీ షాట్కు ప్రయత్నించగా.. మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది.
చాలా హైగా వచ్చిన ఈ క్యాచ్ను అందుకునేందుకు పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నే పరుగెత్తాడు. క్యాచ్ కోసం సహచరులను వారించి మరీ వెనక్కి పరుగెత్తుకొచ్చిన కరుణరత్నే.. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయాడు. దాంతో కోకోబురా బాల్ నేరుగా వచ్చి అతని మూతికి బలంగా తాకింది. దాంతో అతని ముందు పళ్లు నాలుగు ఊడి రక్తం కారింది. పళ్లు రాలినా.. కరుణ రత్నే క్యాచ్ మాత్రం వదల్లేదు. బంతిని అందుకొని పక్కనే వచ్చిన సహచరుడికి ఇచ్చి మూతిని పట్టుకొని నొప్పితో డగౌట్ చేరాడు. ఫిజియో సూచనలతో కరుణ రత్నేను ఆసుపత్రికి తరలించగా.. నాలుగు పళ్లు ఊడిపోయాయని, సర్జరీ చేయాలని వైధ్యులు సూచించినట్లు లంక క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరుణ రత్నే క్యాచ్కు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అనంతరం కెండీ ఫాల్కన్స్ జట్టు 15 ఓవర్లలోనే 121 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెండీ ఫాల్కన్స్ జట్టుకి లంక యంగ్ ఆల్రౌండర్ వానిందు హసరంగ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఆడిన చమీక కరుణరత్నే.. ఏడాది నిషేధానికి గురయ్యాడు. శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు అతనిపై ఏడాది పాటు ఏ ఫార్మాట్ ఆడకుండా లంక బోర్డు నిషేధించింది. నిషేధంతో పాటు 5 వేల యూఎస్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షల రూపాయలు) జరిమానాగా విధించింది. టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన చమీక కరుణరత్నే, బ్రిస్బేన్లోని ఓ క్యాసినోలో తప్పతాగి, అక్కడ కొంతమందితో గొడవపడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఇంగ్లండ్ పర్యటనలోనూ బయోబబుల్ బ్రేక్ చేసి సిగరేట్లు తాగడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.