ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం:
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేము చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయాలు సాధించాం. ఆ ఒక్కదాంట్లో కూడా విజయం సాదించాల్సి కానీ అలా జరగలేదు. మా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. క్రికెట్ను ఆస్వాదిస్తూ ఆడితేనే బాగుంటుంది. ఈ రోజు మ్యాచ్ దానికి ఉదాహరణ' అని కోహ్లీ అన్నారు.
వారే మ్యాచ్ను నిలబెట్టారు:
'డివిలియర్స్, స్టొయినీస్ భాగస్వామ్యం మ్యాచ్ను నిలబెట్టింది. ఒక సమయంలో 175 పరుగులు చేస్తే చాలనుకున్నాం. కానీ స్టొయినీస్, డివిలియర్స్లు అద్భుతంగా ఆడి 200 పరుగుల స్కోర్ చేసారు. ఈ విజయంలో కీలక పాత్ర వాళ్లదే. జట్టుగా ఆడి విజయాలు సాదించడంపైనే దృష్ఠి సారించాం. మేం ఎలా ఆడామన్నది మాకు తెలుసు' అని కోహ్లీ తెలిపారు.
ఓటములు ఎంతో బాధించాయి:
'వరుసగా 6 ఓటములు మమ్మల్ని ఎంతో బాధించాయి. అయినా మా ఆటగాళ్లు ఎవరూ ఒత్తిడికి లోనుకాలేదు. మొహాలీకి ముందు విరామం మాకు కలిసొచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదు. మేం ఎలా ఆడామన్నది ప్రపంచానికి కూడా తెలుసు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ క్రిజులో ఉన్నప్పుడు చాలా డాట్ బాల్స్ వేసాం. అదే మాకు కలిసొచ్చింది. జట్టులో చాలా మంది బౌలర్లు ఉంటే లాభించే అంశం. స్టొయినీస్తో జట్టు సమతూకంగా మారింది. ఈ రోజు మా బౌలర్ల ప్రదర్శన బాగుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
బెంగళూరు హ్యాట్రిక్:
బెంగళూరు వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగినమ్యాచ్లో బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో బెంగళూరు హ్యాట్రిక్ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్)లు ఆకట్టుకున్నారు. డివిలియర్స్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.