న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ ఇషాన్ కిషన్ అసాధరణ ఇన్నింగ్స్తో తమ ఓటమిని శాసించారని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ అన్నాడు. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) విధ్వంసకర డబుల్ సెంచరీకి తోడుగా.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 113) సెంచరీతో చెలరేగడంతో సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన లిటన్ దాస్.. కోహ్లీ, ఇషాన్ చెలరేగుతూ ఉంటే చూస్తూ ఉండిపోయామని, వారిని అడ్డుకోలేకపోయామని తెలిపాడు.
'ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ మా పతనాన్ని శాసించింది. ముఖ్యంగా ఇషాన్ ఆడిన తీరు అద్భుతం. అతనికి నా హ్యాట్సాఫ్. మా బౌలర్లు శక్తి మేర ప్రయత్నించారు. కానీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్పై ఇషాన్ చెలరేగుతుంటే ఏం చేయలేకపోయారు. 330-340 పరుగుల టార్గెట్ ఈ వికెట్పై ఈజీగా చేధించవచ్చు. భారత్ను ఆ స్కోర్కు కట్టడి చేసుంటే మ్యాచ్ మరోలా ఉండేది. టీమిండియా చాలా బలమైన జట్టు. మేం అద్భుతమైన క్రికెట్ ఆడి మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాం'అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు.
చివరి మ్యాచ్లో ఓడినా.. బంగ్లాదేశ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. షకీబ్ అల్ హసన్(43) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ఇషాన్ కిషన్ చేసిన 210 పరుగులను కూడా బంగ్లాదేశ్ బ్యాటర్లు చేయలేకపోయారు.