ఐపీఎల్ ఫైనల్లో చెన్నైకే విజయావకాశాలు ఎక్కువ
ఈ మ్యాచ్ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ ఓ జాతీయ మీడియా సంస్థకి రాసిన వ్యాసంలో ఐపీఎల్ ఫైనల్లో చెన్నైకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు మంత్రం ఒకటే. తుది జట్టులో ఎక్కువ మార్పులు చేయకుండా.. ఒక జట్టునే కొనసాగిస్తూ.. సమష్టిగా ఆడటం. అందుకే ఆ జట్టు ఏడోసారి ఫైనల్ చేరింది' అని అన్నాడు.
చెన్నైని ధోనీ నడిపిస్తున్న తీరు అద్భుతం
'చెన్నైని ధోనీ నడిపిస్తున్న తీరుపై నాకు మాటలు రావడం లేదు. ప్రతి ఒక్కరికీ జట్టులో బాధ్యతలు అప్పగించి జట్టుని నడిపిస్తున్న తీరు అద్భుతం. భారత జట్టు గెలిచిన నాలుగు మెగా టోర్నీలను ఓసారి పరిశీలిస్తే.. అందులో వ్యక్తిగత ప్రదర్శన కంటే.. జట్టు సమష్టి ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
టోర్నీ ఆరంభం నుంచీ చెన్నై సమిష్టి ప్రదర్శన
'1983, 2011 వన్డే వరల్డ్ కప్, 2007లో టీ20 వరల్డ్ కప్, 1985లో ప్రపంచ ఛాంపియన్షిప్ ఇందుకు నిదర్శనం. టోర్నీ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కూడా సమష్టి ప్రదర్శనతోనే రాణించింది. ఫైనల్లోనూ అదే సూత్రంతో హైదరాబాద్పై విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోతుంది' అని శ్రీకాంత్ వెల్లడించాడు.
చెన్నై ఏడోసారి... హైదరాబాద్ రెండోసారి
కాగా, ఈ సీజన్లో లీగ్ దశ నుంచి తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ వరకు చూస్తే... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చెన్నై ఇప్పటి వరకు మొత్తం 9 ఐపీఎల్ సీజన్లు ఆడగా.. ఇందులో ఏకంగా 7 సీజన్లలో ఫైనల్ చేరింది. ఈ అనుభవం కూడా ఆ జట్టుకి లాభించనుంది. ఇక, హైదరాబాద్ మాత్రం ఐపీఎల్ ఫైనల్కు చేరడం ఇది రెండోసారి.