
హైదరాబాద్: టీమిండియా పేసర్ శ్రీశాంత్పై విధించిన జీవితకాల నిషేధం కేసులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశాంత్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఛీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల నేతృత్వంలోని బెంచ్ శ్రీశాంత్పై జీవితకాలం నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది
విచారణ అనంతరం శ్రీశాంత్ మీడియాతో మాట్లాడాడు. 'నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై జీవిత కాల నిషేధం సరికాదు. మళ్లీ క్రికెట్ ఆడాలన్నది నా కల. ఖచ్ఛితంగా నాకు న్యాయ జరుగుతుంది' అని శ్రీశాంత్ అన్నాడు.
అసలేం జరిగింది?
2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్లను స్పాట్ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
దీంతో ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినప్పటికీ, బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేరళ హైకోర్టులో అతడికి ఊరట లభించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బీసీసీఐ సవాల్ చేసింది.
ఇందులో భాగంగా కేరళ హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. శ్రీశాంత్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అందుకే తాము నిషేధం విధించామని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. స్ఫాట్ ఫిక్సింగ్ వ్యవహారం భారత క్రికెట్ని కుదిపేసిందని.. అలాంటి నేరానికి పాల్పడిన క్రికెటర్పై నిషేధం ఎత్తివేయాలనుకోవడం సమంజసం కాదంటూ వాదనలు వినిపించింది.
దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు చేసేదేమీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సోమవారం ఈ నిషేధంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.