హైదరాబాద్: 'తిట్టండి... విమర్శించండి.. కానీ మైదానాలకు వచ్చి భారత ఫుట్బాల్ జట్టు ఆట చూడండి' అంటూ భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించి భారత ఫుట్బాల్ జట్టుకు మద్దతు తెలపాలని అభిమానులను కోరాడు.
అయితే, తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం సునీల్ ఛెత్రికి మద్దతుగా నిలిచాడు. మైదానాలకు వెళ్లి మ్యాచ్లను చూడాలని అభిమానులను కోరాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సచిన్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
'కమాన్ ఇండియా. భారత్ ఎప్పుడు, ఎక్కడ ఆడుతున్నా మైదానాలకు వెళ్లి చూడండి. అంతేకాదు ఆటగాళ్లకు మద్దతుగా నిలవండి. మనమందరం వారి వెనుక నిల్చోవడం ఎంతో ముఖ్యం. ఇదే మనం వారికి ఇచ్చే టానిక్. మన అథ్లెట్లు ఎంతో కఠినంగా ప్రాక్టీస్ చేసి దేశానికి ప్రాతినిధ్యం వహించి మరపురాని విజయాలను అందిస్తున్నారు. దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి కల. పదండి మన ఆటగాళ్లకు మద్దతు ఇద్దాం. కమాన్ టీమిండియా. అథ్లెట్లకు మన మద్దతు ఏమిటో చూపించే సమయమిది. అథ్లెట్లందరికీ ఆల్ ది బెస్ట్' అని సచిన్ అందులో చెప్పుకొచ్చాడు.
C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp
— Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018
కాగా, ఇంటర్ కాంటినెంటల్ కప్ మ్యాచ్లో భాగంగా సోమవారం భారత పుట్ బాల్ జట్టు కెన్యాతో తలపడనుంది. ఇది సునీల్ ఛెత్రికి 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. శుక్రవారం మొదలైన నాలుగు దేశాల టోర్నీ ఆరంభ మ్యాచ్లో భారత్.. చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు కేవలం రెండు వేల మంది మాత్రమే హాజరుకావడంతో ముంబైలోని ఫుట్బాల్ ఎరీనా స్టేడియం బోసిగా కనిపించింది.