కపిల్ దేవ్ చేతుల మీదుగా..
2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది. పేదరికంతో ఉన్నత చదువులు చదవలేని బాలికలు, యువతులకు ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా బాలికల విద్య కోసం పాటుపడుతోంది.
సంతోషంగా ఉందబ్బా..
ఖుషి ఫౌండేషన్కు లెజెండ్స్ లీగ్ క్రికెట్ అండగా నిలవడంపై కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఖుషి స్వచ్చంద సంస్థ మనందరిది. భారత్లోని బాలికల కోసం మేం చాలా చేయాలనుకుంటున్నాం. మా ప్రయత్నానికి దిగ్గజ ఆటగాళ్లంతా అండగా నిలవడం సంతోషకరం. ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం ప్రశంసించదగిని విషయం.
దేశంలోని ఆడపిల్లల కోసం మనమంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖుషి స్వచ్చంద సంస్థ ద్వారా మేం ఇప్పటికే 12 రాష్ట్రాల్లోని 46 వేల మంది పిల్లలకు విద్యను అందిస్తూ వారి జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటికే చాలా చేశాం.. ఇంకా చేయాల్సి ఉంది'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
|
అలరించడమే కాదు.. అండగా ఉంటాం..
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ లక్ష్యానికి సాయం అందించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని లెజెండ్స్ లీగ్ ఫౌండర్ వివేక్ ఖుషాలని తెలిపారు. 'ఖుషి ఫౌండేషన్కు లెజెండ్స్ లీగ్ క్రికెట్ అండగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పేందుకు మేం సంతోషపడుతున్నాం. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న ఖుషి లాంటి స్వచ్చంద సంస్థకు ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం దక్కడం, కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్ లక్ష్య సాధనలో భాగం కావడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రేక్షకులను అలరించడమే మా లక్ష్యం కాదు. సమాజంలో మార్పు తెచ్చేందుకు కూడా మా వంతు సాయం చేస్తాం.'అని వివేక్ పేర్కొన్నారు.
ఆరు వేదికల్లో మ్యాచ్లు..
లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) రెండో సీజన్తో వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో అభిమానులను అలరించేందుకు అలనాటి ఆటగాళ్లు సిద్దమవుతున్నారు. టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్లో పోటీ పడేందుకు రెడీ అయ్యారు. ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా చారిటీ మ్యాచ్ జరగనుండగా.. సెప్టెంబర్ 17న అసలు సిసలు మ్యాచ్ షురూ కానుంది. మొత్తం ఆరు వేదికల్లో అక్టోబర్ 8 వరకు మ్యాచ్లు జరగనున్నాయి.