బీసీసీఐకి అన్ని అర్హతలు ఉన్నాయని
నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లన్నీ ఆర్టీఐ కింద ఉన్నప్పుడు... బీసీసీఐని ఎందుకు చేర్చకూడదని ప్రశ్నించింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసులు చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 12 ప్రకారం ప్రభుత్వ సంస్థగా ప్రకటించడానికి బీసీసీఐకి అన్ని అర్హతలు ఉన్నాయని లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చౌహాన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
బీసీసీఐ నిర్ణయాలపై కోర్టుల్లో
ఓ రాష్ట్రానికి ఉన్న అధికారాలను బీసీసీఐ అనుభవిస్తున్నది. ఇది అందులోని భాగస్వాముల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది అని లా కమిషన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు సూచించింది. ఒకవేళ లా కమిషన్ సిఫారసును కేంద్రం ఆమోదిస్తే గనక.. ఇక నుంచి బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసుకోవచ్చు.
ఆర్టీఐ పరిధిలోకి వస్తే
బీసీసీఐ కుదుర్చుకునే ఒప్పందాలను కూడా కోర్టుల్లో సవాలు చేసే వీలుంటుంది. దేశంలో క్రికెట్ మొత్తాన్ని తమ చేతుల్లో పెట్టుకొని బీసీసీఐ అక్రమాలకు పాల్పడుతున్నదని లా కమిషన్ అభిప్రాయపడిది. ఇక ఆర్టీఐ చట్టం పరిధిలోకి బీసీసీఐని కచ్చితంగా తీసుకురావాలని కూడా కమిషన్ సూచించడం గమనార్హం. బీసీసీఐని ఓ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్గా చూస్తున్నట్లు ప్రభుత్వం లోక్సభలో ప్రకటించింది. దీంతో ఆటోమెటిగ్గా బీసీసీఐ కూడా ఆర్టీఐ చట్టం కిందికి వస్తుంది అని కమిషన్ స్పష్టంచేసింది.
2016లో సుప్రీం కోర్టు కూడా
అలాగే 2016లో సుప్రీం కోర్టు కూడా క్రికెట్ బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తెచ్చేందుకు న్యాయపరమైన కసరత్తు చేయాలని కమిషన్కు సూచించింది. టీమ్ ఎంపిక, రాష్ట్రాలు, జోన్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని కోర్టుల్లో లేవనెత్తవచ్చు. ఇదే నేపథ్యంలో రెండేళ్ల పాటు నడిచిన వాదన కొలిక్కి వచ్చింది.