ఆటపై ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు:
'ఇక టీ20 క్రికెట్కు కూడా దూరమవుతున్నా. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నా. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. వచ్చే రోజుల్లో నా అనుభవాలను యువ క్రికెటర్లతో పంచుకుంటా. ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. ఆటపై ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు' అని యార్కర్ కింగ్ లసిత్ మలింగ ట్వీట్ చేశాడు. మలింగ 2019లో వన్డేల నుంచి తప్పుకోగా.. 2011లో టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 2021లో టీ20లకు కూడా గుడ్బై చెప్పి అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. ప్రాంచైజీ లీగ్ కూడా మలింగ ఆడానని చెప్పాడు.
కేరిర్లో 546 వికెట్లు:
గొప్ప టీ20 బౌలర్లలో ఒకడిగా పేరున్న లసిత్ మలింగ.. 2014 టీ20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించాడు. చివరిసారి 2020 మార్చిలో లంక తరఫున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పోటీపడే లంక జట్టులో మలింగకు చోటు దక్కలేదు. శ్రీలంక తరఫున 84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగ 107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన యార్కర్ కింగ్.. 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్లో 546 వికెట్లు సాధించాడు. అంతేకాదు 122 ఐపీఎల్ మ్యాచ్లు కూడా మలింగ.. ఇప్పటికీ అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్ మలింగనే. ఐపీఎల్లో 122 మ్యాచ్ల్లో 170 వికెట్లు తీశాడు. 5/13 అత్యుత్తమ ప్రదర్శన.
అయిదుసార్లు హ్యాట్రిక్:
విచిత్రమైన బౌలింగ్ శైలితో బ్యాట్స్మెన్ను తికమక పెట్టి వికెట్లు తీయడం ద్వారా లసిత్ మలింగ వెలుగులోకి వచ్చాడు. మొదట్లో అతడి బౌలింగ్కు అలవాటు పడటమే బ్యాట్స్మెన్కు సవాలుగా మారింది. ఇక ఓవర్లోని ఆరు బంతులను కూడా యార్కర్లుగా సంధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతడి యార్కర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కెరీర్లో పదునైన యార్కర్లతో బ్యాట్స్మెన్ను హడలెత్తించిన మలింగ.. అంతర్జాతీయ క్రికెట్లో అయిదుసార్లు హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. రెండు సార్లు టీ20ల్లో, మూడుసార్లు వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ మలింగనే.
నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు:
లసిత్ మలింగ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు రెండుసార్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2007లో మలింగ తొలిసారి నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు. 2019 సెప్టెంబర్లో పల్లెకెలె వేదికగా కివీస్తో జరిగిన టీ20లో మరోసారి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. కోలిన్ మున్రో, రూథర్ ఫోర్డ్, కోలిన్ గ్రాండ్హోమ్,రాస్ టేలర్లను ఔట్ చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డ్తో పాటు ముంబై ఇండియన్స్, మెల్బోర్న్ స్టార్స్, కెంట్ క్రికెట్, రంగ్పూర్ రైడర్స్, గుయానా అమెజాన్ వారియర్స్, మరాఠా అరేబియన్స్, మాన్ట్రియల్ టైగర్స్ జట్టుకు మలింగ ఆడాడు.