పుణె: సుదీర్ఘ ఫార్మాట్ ఎప్పటి నుంచో అయిదు రోజులే ఉంది. సంప్రదాయ ఫార్మాట్లో మార్పులు చూడాలనుకోవట్లేదు. అయిదు రోజుల టెస్టుకే నేను మద్దతు ఇస్తా అని టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టును మాజీలు, కోచ్లు, క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ నిడివిని తగ్గించవద్దనే సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
గంగూలీని ట్రోల్ చేసిన సచిన్.. వెల్డన్ 'దాది' ఏం చెప్పావ్!!
టెస్టుల సమయం కుదించడంపై మార్చిలో జరిగే వార్షిక సమావేశంలో ఐసీసీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'అయిదు రోజుల టెస్టుకే నా పూర్తి మద్దతు. సుదీర్ఘ ఫార్మాట్ ఎప్పటి నుంచో అయిదు రోజులే ఉంది. సంప్రదాయ ఫార్మాట్లో మార్పులు చూడాలనుకోవట్లేదు. ఈ ఫార్మాట్ను అలానే కొనసాగించాలి' అని అన్నాడు.
శ్రీలంక కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా సుదీర్ఘ ఫార్మాట్పై స్పందించాడు. 'టెస్టు క్రికెట్లో మానసిక, శారీరక, సాంకేతిక సవాళ్లు ఉంటాయి. అయిదో రోజు ఆటలో ఫలితాలు వస్తాయి. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్లో ఐదవ రోజే ఫలితం వచ్చింది. అయిదు రోజుల టెస్టుకు ఆర్థిక ఒత్తిళ్లు ఎదురవుతాయని తెలుసు. కానీ.. ఉత్కంఠ ఫలితాలు రావాలంటే సంప్రదాయ ఫార్మాట్ నిడివిని అలానే కొనసాగించాలి' అని మిక్కీ పేర్కొన్నాడు.
2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లు అమలు చేయాలని ఐసీసీ భావిస్తుండగా.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రికీ పాటింగ్, మెక్గ్రాత్, సందీప్ పాటిల్, మహేళ జయవర్ధనె, ఇయాన్ బోథమ్ టిమ్ పైన్, నాథన్ లైయన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఐసీసీ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారు. అయితే నాలుగు రోజుల టెస్టు నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.