హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య పల్లెకెలె వేదికాగ జరుగుతున్న మూడో టెస్ట్లో శ్రీలంక బ్యాట్స్మన్ కుశాల్ మెండీస్ అవుటైన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టెస్టు క్రికెట్లో బంతి బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లినా.. సాధారణంగా బ్యాట్స్మెన్ ఒక పరుగుతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు.
అలాంటిది బంతి ఫీల్డర్ చేతికి చిక్కిందని తెలిసినా లేని పరుగు కోసం ప్రయత్నించి కుశాల్ మెండిస్ రనౌటయ్యాడు. అంతేకాదు ఈ రనౌట్ నుంచి బయటపడే అవకాశం వచ్చినా అందిపుచ్చుకోలేకపోయాడు. రెండో రోజైన ఆదివారం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
ఈ సమయంలో చండీమాల్, మెండిస్ క్రీజులో ఉన్నారు. మహ్మద్ షమీ బౌలింగ్లో బంతిని కెప్టెన్ దినేశ్ చండిమాల్ మిడ్వికెట్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ డైవ్ చేసి బంతిని దొరకబుచ్చుకున్నాడు. అవతలి ఎండ్లో ఉన్న మెండిస్ పరుగు కోసం క్రీజు వదిలి ముందుకొచ్చాడు.
దీంతో వెంటనే అశ్విన్ రనౌట్ కోసం బంతిని బౌలర్ షమీకి అందించాడు. అయితే ఆ బంతిని షమీ అందుకోలేకపోవడంతో అది కాస్తా సిల్లీ పాయింట్లో ఉన్న కుల్దీప్ వద్దకు వెళ్లింది. దీంతో మెండిస్ను చూసిన చండీమాల్ వెనక్కి వెళ్లాల్సిందిగా మెండిస్కు సూచించాడు.
అతను వేగంగా వెనక్కి వచ్చినా అప్పటికే బంతిని అందుకున్న కుల్దీప్ డైరెక్ట్ త్రోతో బెయిల్స్ని పడగొట్టేశాడు. ఫలితంగా మెండిస్ పెవిలియన్ చేరాడు. ఈ రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
— Yograj Singh (@Cricvids1) August 13, 2017