ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అతని ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపిక చేశారు. ఇక మొదటి టీ20కి ముందు.. మంగళవారం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా కుల్దీప్ కుడి చేతికి గాయమైంది. గాయం తీవ్రత వల్ల అతను ఈ సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్కు దూరమైనందుకు చాలా నిరాశ చెందానని, కానీ మరింత బలంగా తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నానని గురువారం ఇన్స్టాలో కుల్దీప్ పోస్ట్ చేశాడు.
కుల్దీప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పిక్ షేర్ చేస్తూ.. 'గాయం వల్ల సౌతాఫ్రికా సిరీస్కు దూరమైనందుకు కాస్త నిరాశ చెందాను. ఈ సిరీస్లో నా సహచర క్రికెటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తారని నేను కచ్చితంగా భావిస్తున్నాను. నేను వారికి అన్ని విధాలుగా నా మద్దతు ఇస్తున్నాను. మరింత బలంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాను' అని కుల్దీప్ ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్ ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ 2022లో కుల్దీప్ ఢిల్లీ తరపున 14 మ్యాచ్లు ఆడాడు. 8.44ఎకానమీ రేటుతో 19.95సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ఇకపోతే దక్షిణాఫ్రికా సిరీస్కు కుడి గజ్జలో గాయం కారణంగా కేఎల్ రాహుల్, చేతి గాయం కారణంగా కుల్దీప్ యాదవ్ దూరమయ్యారు.
కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికా సిరీస్కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ను కెప్టెన్గా, హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీ కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ల స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. వీరిద్దరు బెంగళూరులోని NCAకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వైద్య బృందం వారి గాయాల తీవ్రతను మరింత అంచనా వేసి.. తగిన చికిత్స అందిస్తుంది.
మొదటి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా టీ20 జట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్