
హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమిని విచారణకు హాజరుకావాల్సిందిగా కోల్కతా పోలీసులు తాజాగా సమన్లు జారీ చేశారు. బుధవారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. క్రికెటర్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ గృహి హింస చట్టం కింద కేసును ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా హాజరు కావాలంటూ షమికి పోలీసులు సమన్లు ఇచ్చారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా షమిపై జహాన్ ఫిర్యాదు చేసింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోల్కతా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. కేసు నడుస్తుండగానే తనకు నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. అందులో రూ. 7 లక్షలు కుటుంబ నిర్వహణకు, మరో రూ. 3 లక్షలు కూతురు కోసం అని పేర్కొంది.
ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని కోల్కతా పోలీసులను అలీపూర్ కోర్టు ఆదేశించింది. హసీన్ జహాన్కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష ఓ చెక్ ఇస్తే.. అది కూడా బౌన్స్ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసింది విదితమే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్ తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 21న ఆడనుంది. బెంగళూరు వేదికగా షమీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఈ లోగా షమి విచారణకు హాజరై తిరిగి యథావిధిగా జట్టులో కలుస్తాడు. విచారణలో భాగంగా షమీ సోదరుడ్ని కూడా హాజరు కావాలనడంతో.. అనారోగ్యం కారణంగా సమయం ఇవ్వాలని కోరగా.. అందుకు పోలీసులు ఒప్పుకున్నట్లు అన్నట్లు సమాచారం.