ఇష్టానుసారంగా నిర్ణయాలు..
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం మాంచెస్టర్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత జట్టు తన ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు అనేక పొరపాట్లను చేసినట్లు పరిపాలనా కమిటీ గుర్తించింది. టీమ్ మేనేజ్మెంట్ సైతం ఇష్టానుసారంగా, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోవడం వల్లే ఓటమి ఎదురైందని కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ రవిథడ్గె భావిస్తున్నారు. దీనికి కొన్ని సహేతుక కారణాలను సైతం వారు నమోదు చేసుకున్నారు.
ధోనీని వెనక్కి నెట్టడం మా వ్యూహంలో భాగం: నాలుగో స్థానం ఖాళీగా ఉంది: రవిశాస్త్రి
ఒంటెద్దు పోకడల వల్ల నష్టం..
విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడంలో టీమ్ మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు పరిపాలన కమిటీ అనుమానిస్తోంది. జట్టు జయాపజయాలను ప్రభావితం చేస్తుందని భావించే ఎలాంటి నిర్ణయాన్నయినా సమష్టిగా తీసుకోవాల్సి ఉండగా.. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఒంటెద్దు పోకడలను పోతోందన్న అనుమానాలు కమిటీ సభ్యుల్లో వ్యక్తమౌతున్నాయి. త్వరలో నిర్వహించబోయే సమీక్షా సమావేశాల సందర్భంగా ఇదే విషయాన్ని వారు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కేప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ల దృష్టికి తీసుకెళ్లబోతారని అంటున్నారు. దీనిపై సమగ్రమైన, సంతృప్తికరమైన సమాధానాలను ఇవ్వాల్సిన బాధ్యత ఈ ముగ్గురిపై ఉంటుందని చెబుతున్నారు. సమష్టి నిర్ణయాలకు దూరంగా ఉండటం వల్ల సమీప భవిష్యత్తులో జట్టు ప్రదర్శనపై దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు లేకపోలేదని, ఇలాంటి వైఖరిని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉన్నట్లు చెబుతున్నారు.
పాయింట్ టు పాయింట్..
సెమీస్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో మహేంద్రసింగ్ ధోనీని ఏడో స్థానంలోకి తీసుకుని రావడం మొదలుకుని కొన్ని కీలక అంశాలపై పరిపాలనా కమిటీ.. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీలను ప్రశ్నించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్లల్లో ధోనీ బ్యాటింగ్ శైలిపై లేవనెత్తిన విమర్శలను కూడా ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. ధోనీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు చేయడం వల్ల ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయేలా ప్రవర్తించారనే తీవ్ర విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటోంది టీమ్ మేనేజ్మెంట్. దీనికి అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీని వెనక్కి పంపండం ఈ అనుమానాలు, విమర్శలకు బలం చేకూర్చినట్టయింది.
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్పై రోడ్ మ్యాప్..
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ను ఆస్ట్రేలియా నిర్వహించబోతోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇందులోనైనా విజేతగా ఆవిర్భవించడానికి గల అవకాశాలపై ఓ రోడ్ మ్యాప్ను సిద్ధం చేయబోతోంది. ఈ రోడ్ మ్యాప్ తీరుతెన్నులు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగా జట్టు కూర్పు ఉండాలని, మహేంద్రసింగ్ ధోనీని టీ20 ప్రపంచకప్ వరకూ వీడ్కోలు పలకకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షా సమావేశం ఎప్పుడనేది ఇంకా తేలాల్సి ఉంది. టీమిండియా స్వదేశానికి వచ్చిన తరువాత కొంత విశ్రాంతి తీసుకునే వీలు కల్పిస్తుందని, ఆ తరువాతే ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని అంటున్నారు.