'జనతా కర్ఫ్యూ'ను ఫాలో అవుదాం.. ధైర్యంగా ఉండి కరోనాపై పోరాడుదాం!!

ఢిల్లీ: మహమ్మారి కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 9,700 మంది ప్రాణాలను బలితీసుకుంది. 2,34,000 మందికి వైరస్ సోకింది. ఇప్పుడు భారత్లోనూ ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే 195 మంది వైరస్ బారిన పడగా.. నలుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వైరస్ నివారణకు ప్రజలంతా స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ' పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆయన కోరారు.

ప్రధానితో చేతులు కలుపుదాం:
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు టీమిండియా క్రికెటర్లు స్పందించారు. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రిషభ్పంత్, ఉమేశ్ యాదవ్, అజింక్యా రహానె, కుల్దీప్ యాదవ్లు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని ట్విటర్ వేదికగా కోరారు. కరోనా వైరస్కు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనాను తరిమికొట్టొచ్చని చెప్పారు. 'ప్రధాని మోదీతో చేతులు కలిపి ఈ ఆదివారం జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఎంతో సంయమనం పాటించాలి' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

మోదీ సూచనలను పాటిద్దాం:
'కరోనా వైరస్ వల్ల కలిగే ప్రమాదంను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మనమంతా బాధ్యతాయుతమైన పౌరులం. మన ఆరోగ్య భద్రత కోసం ప్రధాని మోదీ సూచనలను పాటిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా బాధితులను కాపాడుతున్న వైద్య సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించి మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం' అని విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు.

అనవసర ప్రయాణాలు చేయకండి:
'ఈనెల 22న మనమంతా ఇంట్లోనే ఉండాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంగా ఉండండి' అని ఓపెనర్ శిఖర్ ధావన్ సూచించాడు. 'ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనమంతా అప్రమత్తంగా ఉండాలి. మన భద్రత కోసం ప్రభుత్వం సూచించిన విషయాలను తప్పకుండా పాటించాలి. అనవసర ప్రయాణాలు చేయకండి. వైరస్ బాధితులను కాపాడుతున్న వైద్య నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు.

ధైర్యంగా ఉండి కరోనాపై పోరాడాలి:
'మనల్ని పరీక్షించే సమయం ఇది. ఈ సందర్భంగా వైద్య నిపుణులు, సిబ్బందికి నా సెల్యూట్. బాధ్యతాయుతమైన పౌరులుగా మీ అందరికీ ఒక్కటే వేడుకుంటున్నా. ప్రభుత్వం సూచించిన విషయాలను తప్పకుండా పాటించండి. జాగ్రత్త వహించండి' అని ఓపెనర్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. 'ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండి కరోనాపై పోరాడాలి. ప్రధాని మోదీ చెప్పిన విషయాలను కచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నా. అప్రమత్తంగా ఉండి, ఆరోగ్యంగా ఉందాం' అని పేసర్ ఉమేశ్ యాదవ్ చెప్పాడు.

జనతా కర్ఫ్యూ మంచి ఆలోచన:
'ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, కరోనాను పారదోలేందుకు మనవంతు కృషి చేయాలి. మన భద్రత కోసం ప్రధాని మోదీ సూచించిన విషయాలను కచ్చితంగా పాటిద్దాం. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి' అని టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్యా రహానె అన్నాడు. 'కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉందాం. జనతా కర్ఫ్యూ చాలా మంచి ఆలోచన. మనమంతా దాన్ని కచ్చితంగా అమలుచేద్దాం. సామాజిక దూరం పాటించి భయాన్ని పోగడదాం' అని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications