ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు సంబరాలను
పెర్త్ టెస్టులో భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, టిమ్పైన్ మాటల యుద్ధం హద్దు మీరలేదని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అన్నాడు. పోటాపోటీగా జరిగే టెస్టు క్రికెట్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు కోహ్లీ సంబరాలను హస్సీ ఇంతకు ముందు విమర్శించాడు. అయితే తాజాగా మరోసారి దాని గురించి మాట్లాడుతూ.. అతడు నియంత్రణ కోల్పోయాడని పేర్కొన్నాడు.
ఇలాంటి ఘటనలు మామూలే
‘ఇద్దరి గొడవ గీత దాటలేదు. అదే తరహాలో మరీ దూకుడు కనిపించలేదు. వ్యక్తిగతంగా కించపరిచే మాటలు లేవు. సిరీస్ కఠినంగా సాగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మామూలే. కోహ్లీ, పైన్ గొడవ చేతల వరకూ పోకుండా హుందాగానే నడుచుకున్నారు. భావోద్వేగాలు దెబ్బతినక ముందే గొడవ సద్దుమణిగింది. వారు విశ్వసించిన దానిపై నిలబడ్డారు. అదీ సరైన దారిలోనే జరిగింది. అంతేకానీ, అవమానాలు, అవహేళనలు లేవు' అని హస్సీ అన్నాడు.
ఆసీస్ జట్టు ఆటతీరు ఆహ్లాదంగా
‘నా వరకు మైదానంలో ఆసీస్ జట్టు ఆటతీరు ఆహ్లాదంగా అనిపించింది. వారి నైపుణ్యాలు గొప్పగా ఉన్నాయి. గట్టి పోటీనిచ్చేందుకు శాయశక్తులా కష్టపడ్డారు. ఆటగాళ్లు దూకుడుగా ఉండాలి కానీ ప్రత్యర్థిని గౌరవించాలి. బహుశా చాలాసార్లు మేమలా నడుచుకోలేదు. మేం విమర్శలకు అర్హులమే. నా దృష్టిలో మాత్రం ప్రస్తుత జట్టు ఆస్ట్రేలియా బ్రాండ్ కఠిన క్రికెట్ను ఆడుతోంది.
ప్రత్యర్థి జట్టు కెప్టెన్ని గౌరవించాలి
నువ్వు కోపంగా ఉండొచ్చు. దాంతోపాటుగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ని గౌరవించాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ ఎఫ్పట్నుంచో అదే పద్ధతి పాటిస్తుంది. కానీ, అన్ని సార్లు మేము అలాగే ఊరుకోం. ఆస్ట్రేలియా క్రికెట్ గట్టి పోటీనివ్వడంతో గేమ్ మంచి రసవత్తరంగా సాగింది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు విమర్శలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఆస్ట్రేలియా తన స్థాయి ప్రదర్శన చేసిందని అనుకుంటున్నాను' అని హస్సీ అన్నాడు.