సౌతాంప్టన్: వాణిజ్య అంశాలు ఎక్కువ అవడం వల్ల, క్రికెట్లో నాణ్యత దెబ్బతింటోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్తగా 100 బంతుల ఫార్మాట్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను కోహ్లీ తప్పుబట్టాడు.
2020 నుంచి 100 బంతుల టోర్నీ: ఆదరణ కోసం కోహ్లీ, ధోని
"విపరీతమైన క్రికెట్ ఆడుతుండటం ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. క్రికెట్లో వాణిజ్య అంశాలు గేమ్లోని అసలు నాణ్యతను దెబ్బతీస్తోందని నాకు అనిపిస్తుంది. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది" అని విజ్డెన్ క్రికెట్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ అభిప్రాయపడ్డారు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 100 బంతుల అంటూ అంతర్జాతీయ క్రికెట్లో కొత్త ఫార్మాట్కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనిపై తాను మరో కొత్త ఫార్మాట్లో భాగం కాదలచుకోలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈసీబీలాంటి బోర్డు ఈ ఫార్మాట్ను తెరపైకి తెస్తుండటం ఆసక్తి రేపుతున్నా తనకు మాత్రం ఈ కొత్త ఫార్మాట్పై ఆసక్తి లేదని కోహ్లి చెప్పాడు.
100 బంతుల ఫార్మాట్!: అదెలాగా? గంగూలీ విముఖత
కచ్చితంగా ఆ ఫార్మాట్ను లాంచ్ చేయబోయే జట్టులో తాను ఉండబోనని, ఏ కొత్త ఫార్మాట్కు తాను ఓ టెస్టింగ్ ప్లేయర్గా మారదలచుకోలేదని కోహ్లీ అన్నాడు. తాను ఐపీఎల్లాంటి లీగ్లకు మద్దతిస్తాను తప్ప, ఇలాంటి ప్రయోగాలకు కాదని కూడా కోహ్లీ అన్నాడు. టీ20 ఇన్నింగ్స్కు బదులు 100 బంతులు ఉండేలా మ్యాచ్ నిర్వహించే ప్రతిపాదనను ఇంగ్లాండ్ బోర్డు తీసుకొచ్చింది.
నిజానికి ఐపీఎల్ను కాపాడుకోవడానికి బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ లీగ్లలో ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ, ఈ బంతుల ఫార్మాట్ విషయంలో మాత్రం బోర్డు కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 120 బంతులకు బదులు 100 బంతులు మాత్రమే ఆడే టోర్నీ. ఒక్కో ఇన్నింగ్స్లో వంద బంతులు మాత్రమే ఉండటం ఈ టోర్నీ ప్రత్యేకత.
ఈ ప్రతిపాదన ప్రకారం 15 ఓవర్ల వరకు ఓవర్కు ఆరు బంతులు వేయించి, పది బంతులతో చివరి ఓవర్ ఉండేలా ఈ కొత్త ఫార్మాట్ను ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు రూపొందించింది. అంతేకాదు 2020లో ఎనిమిది జట్లతో ఈ ఫార్మాట్లో టోర్నీ ఆడించడానికి ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.
ఈ 100 బంతుల టోర్నీపై గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం విముఖత తెలిపాడు. 100 బంతుల ఫార్మాట్ వల్ల మంచి జట్టుకు.. సాధారణ జట్టుకు అంతరం తగ్గిపోతుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
'ప్రేక్షకుడు కన్ను మూసి తెరిచే లోపు మ్యాచ్ అయిపోతే ఎలా? కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫార్మాట్ కుదించే కొద్దీ మంచి జట్టుకు.. సాధారణ జట్టుకు మధ్య మధ్య అంతరం తగ్గిపోతుంది. 'వీక్షకుడు నిర్ణీత సమయంలో ఆటను ఆస్వాదించాలనుకుంటాడు. నిజమైన ప్రతిభ చూడాలని, అసలైన విజేతలే గెలవాలని కోరుకుంటాడు. ఆటను ఇంకెంతగా కుదించేస్తారో చూడాలి' అని గంగూలీ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు.