న్యూఢిల్లీ/మెల్బోర్న్: ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులో భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ కావడం కేవలం దురదృష్టమేనని, ఇందులో విరాట్ తప్పేమీ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. ఒక్క మ్యాచులో పరుగులు సాధించనంత మాత్రాన విమర్శించడం సమంజసం కాదని తెలిపాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టుపై మంచి గణాంకాలను విరాట్ కోహ్లీ నమోదు చేసిన సంగతిని మరువొద్దని చెప్పాడు. కీలకమైన సెమీ ఫైనల్లో రాణించకపోవడం కోహ్లీ దురదృష్ణమని, ఇటువంటివి ఆటలో సహజమని అన్నాడు.
ప్రపంచ కప్ టోర్నీలో బలమైన జట్లే ఫైనల్కు వెళ్లాయని ద్రావిడ్ తెలిపాడు. న్యూజిలాండ్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిందని తెలిపాడు. సెమీస్ వరకు టీమిండియా ఎక్కడా తడబడలేదని విశ్లేషించాడు. ఆస్ట్రేలియా బలమైన జట్టు కావడం వల్లనే ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ద్రావిడ్ తెలిపాడు.
కాగా, విరాట్ కోహ్లీ వైఫల్యం వెనక అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కారణమని ఆరోపిస్తూ, వీరిద్దరిపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతోపాటు క్రికెట్, బాలీవుడ్ ప్రముఖులు అనుష్క, కోహ్లీలకు మద్దతుగా మద్దతుగా నిలిచారు.