అసలేం జరిగింది?:
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.
తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ కోరగా.. కేఎల్ రాహుల్ ఇంకా స్పందించలేదు.
మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు
టీవీ షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై రెండు వన్డేల నిషేధం విధించాలని తాను ప్రతిపాదించినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేయగా.. కమిటీలోని మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు న్యాయపరమైన సలహా తీసుకుందామని అన్న సంగతి తెలిసిందే. దీనిపై సీఓఏ ఇంకా ఏకాభిప్రాయానికి రాకపోయినా.. వీరిపై ఏదో రూపంలో చర్యలు మాత్రం తప్పవని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఒకవేళ బీసీసీఐ నిషేధిం విధిస్తే.. పాండ్యా, రాహుల్ శనివారం నుంచి ఆసీస్తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు వన్డేలకు దూరమవుతారు.
కెప్టెన్ కోహ్లీ స్పందన
"పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు. వారిద్దరూ చాలా తప్పుగా మాట్లాడారు. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు బాధ్యతగా మెలగాలి. వారి వ్యక్తిగత వ్యాఖ్యలను జట్టుకు ఆపాదించడం సరికాదు" అని కోహ్లీ అన్నాడు. ఈ వివాదం జట్టుపై, తమ ఆటతీరుపై ఎటువంటి ప్రభావం చూపబోదని కోహ్లీ స్పష్టం చేశాడు.
బీసీసీఐ లీగల్ సెల్ ఇలా
మహిళల పట్ల పాండ్యా, రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బీసీసీఐ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి రాదని, అయితే సస్పెన్షన్ నిర్ణయం సీఓఏ తీసుకోవచ్చని బీసీసీఐ లీగల్ సెల్ స్పష్టం చేసింది. బీసీసీఐ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పరిశీలించిన లీగల్ సెల్ ఈ ఇద్దరు ప్లేయర్స్ను సీఓఏ సస్పెండ్ చేయవచ్చు అని స్పష్టం చేసింది. సీఓఏకు ఈ విషయంలో ఉన్న అధికారాలను కూడా పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం బీసీసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి కూడా రాదని లీగల్ సెల్ చెప్పింది. దీని ప్రకారం మైదానంలో జరిగిన తప్పిదాలతోపాటు మైదానం బయట కూడా మ్యాచ్ లేదా ఆటగాళ్లు, జట్టు, సపోర్ట్ స్టాఫ్కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రమే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది. అయితే రాహుల్, పాండ్యా కేసు వేరని... వాళ్లు ఓ టాక్ షోకు వెళ్లి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.
సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్
‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరినీ రెండు వన్డేల పాటు నిషేధించాలని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేశారు. పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇద్దరికీ బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. పాండ్యా వివరణకు తనకు సంతృప్తినివ్వలేదని, అందుకే రెండు వన్డేల నిషేధానికి సిఫారసు చేసినట్లు వినోద్ రాయ్ వెల్లడించారు. మరోవైపు "ఆ ఇద్దరినీ రెండు వన్డేలకు నిషేధించవచ్చో లేదో తెలుసుకోవడానికి డయానా ఈ అంశాన్ని లీగల్ సెల్కు రిఫర్ చేశారు. ఆమె అంగీకారం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. నా వరకు పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి" అని వినోద్ రాయ్ వివరించారు.
డయానా ఎడుల్జీ
బీసీసీఐ లీగల్ సెల్ సలహా తీసుకున్న అనంతరం డయానా ఎడుల్జీ మాట్లాడుతూ "ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని తెలిసినపుడు వాళ్లను తదుపరి చర్యలు తీసుకునే వరకు సస్పెండ్ చేయడం మంచిది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినపుడు కూడా ఇలాగే చేశాం. ఈ అంశంపై బీసీసీఐ లీగల్ సెల్ అభిప్రాయం, తుది ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ విషయాన్ని ఆటగాళ్లు, జట్టుకు వెంటనే చేరవేయాలి" అని అన్నారు