హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ తిరిగి తన ఫామ్ని అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్ని కొన్నాళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ఎత్తివేత తర్వాత ఆస్ట్రేలియాతో బుధవారంతో ముగిసిన రెండు టీ20ల సిరిస్లో తన ఫామ్ని అందుకున్నాడు.
రెండో టీ20లో భారత్ ఓటమి: సిక్సులతో సహా కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే
విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో 50 పరుగులు చేసిన రాహుల్.. బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో 47 పరుగులు సాధించాడు. మ్యాచ్ అనంతరం 'కాఫీ విత్ కరణ్' వివాదంపై కేఎల్ రాహుల్ స్పందించాడు. ఆ సమయాన్ని క్లిష్ట సమయంగా కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
"నా కెరీర్లోనే అది చాలా కష్ట సమయం. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. అలానే నేను కూడా ఒక కఠినమైన పరిస్థితిన చవిచూశా. ఆ వివాదం తర్వాత నేను జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ప్రతీ ఒక్క క్రికెటర్కు దేశం తరఫున ఆడాలనే కోరిక ఉంటుంది" అని కేఎల్ రాహుల్ చెప్పాడు.
"ఇక్కడ నేను వేరు కాదు. నాకు కూడా దేశానికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి విజయాల్లో పాలు పంచుకోవాలనేదే నా కోరిక. నేను ఎక్కడ ఉన్నా... జట్టులో నాకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలుసు. నాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే నా పని. నాకు అప్పగించిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే నా ముందున్న లక్ష్యం" అని రాహుల్ అన్నాడు.
బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో రెండు టీ20ల సిరిస్ను 2-0తో చేజార్చుకుంది. ఫలితంగా కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 16 సిరీస్లు ఆడింది. 14 సిరీస్లలో గెలిచింది.
మరో సిరీస్ను 'డ్రా' చేసుకొని తాజా టి20 సిరీస్లో ఓడింది. ధోని నుంచి పగ్గాలందుకున్నాక సొంతగడ్డపై ఏ ఫార్మాట్లో అయినా కోహ్లీ సిరీస్ ఓడటం ఇదే తొలిసారి. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, ఐదు వన్డే, రెండు టీ20 సిరీస్లు గెలిచాడు. ఒక సిరీస్ డ్రా అయింది. వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్లను ఓడిపోవడం భారత్కిదే తొలిసారి.