రీప్లేలో పరిశీలించి:
అయితే 19వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ కీలక సమయంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదాస్పదంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ శివమ్ మావీ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి రాహుల్ భారీ షాట్ ఆడగా.. ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్పై అంపైర్లకు స్పష్టత లేకపోవడంతో.. థర్డ్ అంపైర్ సాయం కోరారు. థర్డ్ అంపైర్ పలుమార్లు రీప్లేలో పరిశీలించి.. చివరికి పంజాబ్ కెప్టెన్ రాహుల్ నాటౌట్ అని తేల్చారు. దీనిపై కోల్కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
లాంటి తప్పులు జరగకూడదు:
మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.... 'థర్డ్ అంపైర్ నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాదు జట్టు ప్రయాణాన్ని ముగిస్తాయి. లోకేష్ రాహుల్ చాలా క్లియర్గా ఔటయ్యాడు. థర్డ్ అంపైర్ రీప్లే ఒక్కసారికి మించి కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో మోషన్ లేకుండానే ఔటైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి. పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్లలో బోల్తా పడడం మనం గతంలో కూడా చూశాం. ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటి తప్పులు జరగకూడదు. ఇది ఒక ఆటగాడికే కాకుండా జట్టు మొత్తంపైనా ప్రభావం చూపుతుంది' అని అన్నాడు. నేను ఇప్పటివరకు చూసిన థర్డ్ అంపైరింగ్లో ఇది చాలా చెత్త నిర్ణయం అని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు.
రాహుల్ ఔట్ కావడంతో:
ఛేదనలో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే లైఫ్ పొందిన మయాంక్ చెలరేగిపోయాడు. పవర్ ప్లే ఆఖరికి పంజాబ్ 46/0తో నిలిచింది. ఈ జోడీ బలపడుతున్న స్థితిలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మోర్గాన్ పట్టిన క్యాచ్కు అతడు వెనుదిరిగాడు. మయాంక్ ఔటైన తర్వాత పంజాబ్ స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే మార్క్రమ్ (18) తోడుగా చెలరేగిన రాహుల్.. పంజాబ్ను గాడిలో పెట్టాడు. ఇక 34 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి రాగా.. రాహుల్, మార్క్రమ్ ధాటిగా ఆడడంతో పంజాబ్ విజయానికి దగ్గరైంది. అయితే మార్క్రమ్తో పాటు హుడా (3) వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఒత్తిడిలో పడిపోయింది. కానీ ధాటిగా ఆడిన షారుక్ ఖాన్ (22 నాటౌట్; 1×4, 2×6) పంజాబ్ను తిరిగి లక్ష్యం దిశగా నడిపించాడు. చివరి ఓవర్లో 5 పరుగులు చేయాల్సి రాగా.. రెండో బంతికి రాహుల్ ఔట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. షారుక్ ఆ తర్వాత బంతికి సిక్స్తో జట్టును గెలిపించాడు.