చెన్నై: కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ విండీస్ వీరుడు (5/15) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 43) మినహా అంతా విఫలమయ్యారు.
ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో ఓ దశలో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ముంబై.. వరుసగా వికెట్లు చేజార్చుకొని సాధారణ స్కోర్కు పరిమితమైంది. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన రస్సెల్.. చివరి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఇక కోల్కతా బౌలర్లలో రస్సెల్కు తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఆలౌటైన తొలి జట్టుగా ముంబై అప్రతిష్టను మూటగట్టకుంది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(2)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ కేకేఆర్కు మంచి ఆరంభాన్ని అందించాడు. దాంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ముందకు నడిపించాడు. అయితే సూర్య తన మార్క్ షాట్స్తో అలరించాడు. ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ భారీ షాట్లు ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని షకీబ్ అల్ హసన్ విడదీసాడు. జోరుమీదున్న సూర్యను సూపర్బ్ బాల్కు క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
తర్వాత క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. రోహిత్ ధాటిగా ఆడుతూ రన్రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను ప్యాట్ కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్తో ముంబై పతనం మొదలైంది. బిగ్ హిట్టర్స్ హార్దిక్ పాండ్యా(15) కీరన్ పొలార్డ్(5)లతో పాటు మార్కో జాన్సెన్(0) వరుస ఓవర్లలో ఔటవ్వగా... చివర్లో కృనాల్ పాండ్యా(15) బౌండరీలతో జట్టు స్కోర్ను 150 ధాటించాడు. అయితే రస్సెల్ వేసిన చివరి ఓవర్లో అతనితో పాటు రాహుల్ చాహర్(8), బుమ్రా(0) ఔటవ్వడంతో ముంబై కుప్పకూలింది.