షార్ట్ లిస్ట్ చేస్తూ బీసీసీఐకి పంపిన కమిటీ
వారిని షార్ట్ లిస్ట్ చేస్తూ.. టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేస్తూ కమిటీ షార్ట్లిస్ట్ చేసింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్, టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్ పేర్లను బీసీసీఐకి పంపించింది. దిగ్గజ క్రికెటర్లు కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ఏర్పాటైన తాత్కాలిక కమిటీ గురువారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది.
2008-2011 వరకు పురుషుల జట్టు కోచ్గా
ఈ క్రమంలో బీసీసీఐకి రామన్, కిర్స్టన్ పేర్లను సూచించింది. కోచ్గా కిర్స్టన్కు మంచి పేరుంది. మృదు స్వభావి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. 2008-2011 వరకు ఆయన పురుషుల క్రికెట్ జట్టు కోచ్గా ఉన్నారు. కోట్లాదిమంది భారతీయుల కల అయిన ప్రపంచకప్ను రెండోసారి భారత్కు అందించారు. ఆ తర్వాత కుటుంబంతో గడపాలని దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. ఆయన శిక్షణలోనే యువరాజ్సింగ్ అద్భుతంగా పరిణతి చెందాడు.
బెంగళూరు కోచ్గా పనిచేస్తున్న కిర్స్టన్
గతంలో 2011 నుంచి 2013 వరకు దక్షిణాఫ్రికా కోచ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్గా పనిచేస్తున్నారు. ఒకవేళ టీమిండియా కోచ్గా ఎంపికైతే పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా భారత మహిళా జట్టు కోచ్ బాధ్యతలను వదిలేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆయన పూర్తికాలం మహిళల జట్టుకు శిక్షణ ఇవ్వగలరేమోననే సందేహాలు నెలకొన్నాయి.
ఇంటర్వూ ఎలా జరిగిందంటే
కోచ్ పదవి కోసం మొత్తం 28 మందిని బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసింది. వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్స్టన్, దిమిత్ర మస్కరెన్షా, బ్రాడ్ హగ్, కల్పనా వెంకటాచర్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ముగ్గుర్ని వ్యక్తిగతంగా, కిర్స్టన్ సహా ఐదుగురిని స్కైప్ ద్వారా, ఒకరిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.