న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022 టీ20 టోర్నీకి మహమ్మద్ షమీని ఎంపిక చేయకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరె తప్పుబట్టాడు. అతను ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ఆడాల్సిన ఆటగాడని, అతన్ని ఆసియా కప్కు ఎంపిక చేయకపోవడం ఏంటని ప్రశ్నించాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టులోకి రాగా.. గాయాల కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్కు దూరమయ్యారు. ఈ ఇద్దరి స్థానాలను అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లతో భర్తీ చేశారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్లను సెలెక్టర్లు స్టాండ్బైగా తీసుకున్నారు. విండీస్ పర్యటనకు ఎంపికైన ఇషాన్ కిషన్, సంజూ శాంసన్పై వేటు పడింది. టీమ్ ఎంపికపై స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన కిరణ్ మోరె షమీని తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
'టీ20 ప్రపంచకప్ లో హార్ధిక్ పాండ్యా కీలకంగా మారనున్నాడు. అతను బ్యాట్, బంతితోనే కాదు ఫీల్డింగ్లో సైతం అద్భుతాలు చేయగలడు. హార్ధిక్తో పాటు షమీ కూడా కీలక బౌలర్. అతను లేకుండా ఆసీస్కు వెళ్తే అది భారత జట్టుకు తీరనిలోటు. వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున కచ్చితంగా ఆడాల్సిన క్రికెటర్లలో షమీ ఒకడు. నేనిప్పటికీ అదే చెబుతాను. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రా లేడు. అతని గాయం చిన్నదా..? పెద్దదా..? అనే విషయం నాకు తెలియదు. రాహుల్ ద్రవిడ్కు బ్యాకప్ ఆటగాళ్లను ఉంచుకోవడం అలవాటు. ఒక సీనియర్ బౌలర్ ఎవరైనా గాయపడితే అతడి స్థానంలో అవేశ్ ఖాన్ వస్తాడు. ఒకవేళ బుమ్రా గాయం చిన్నదే అయితే అతనితో పాటుగా షమీ ప్రపంచకప్ ఆడేందుకు వెళ్తాడు.' అని కిరణ్ తెలిపాడు.
మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో షమీని ఎంపిక చేయాల్సిందన్నాడు. అంతేకుండా జట్టులోకి నలుగురు స్పిన్నర్లను తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. నాలుగో స్పిన్నర్కు బదులు సీనియర్ పేసర్ అయిన మహమ్మద్ షమీని తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఒక్కటి మినహా మిగతా టీమ్ బాగుందని, టీ20 ప్రపంచకప్కు ఇది బ్లూ ప్రింట్ అని పేర్కొన్నాడు.