ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్లో అర్ష్దీప్ సింగ్ ఎంపిక కావడంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ కిరణ్ మోరే ఆనందం వ్యక్తం చేశాడు. టీమిండియా ఎట్టకేలకు మంచి లెఫ్టార్మ్ పేసర్ను కనుగొందని కితాబిచ్చాడు. అర్షదీప్ సింగ్ టీమిండియాకు ఎంపికై తనకు అవకాశాలు వచ్చినా ప్రతిసారి సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం అర్ష్దీప్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. జట్టు కోసం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
అలాగే కీలక సమయంలో కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్పై టీ20ల్లో భారత్ 4-1తో సిరీస్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అతనికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. మోరే.. స్టార్ స్పోర్ట్స్ షో ఫాలో ది బ్లూస్లో మాట్లాడుతూ.. ఆసియా కప్ జట్టులో 23ఏళ్ల అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కడం సంతోషంగా ఉందని, భారత టీం లెఫ్టార్మ్ పేసర్ వెతుకులాటకు ముగింపు లభించిందని చెప్పాడు.
'అర్ష్దీప్ సింగ్ జట్టులోకి రావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అతను ఐపీఎల్లో ఎలా రాణించాడో చూశాం. అలాగే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బాగా రాణించడాన్ని చూశాం. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఎంపికయ్యాడు. అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. కొన్నేళ్లుగా ఇండియా నిఖార్సైన లెఫ్టార్మ్ పేసర్ కోసం వెతుకుతుంది. అది నేటితో ముగిసింది.' అని మోరే చెప్పాడు.
అలాగే విరాట్ కోహ్లీ తిరిగి పుంజుకోవాల్సిన అవసరముందని, ఆసియా కప్ టోర్నమెంట్ అతనికి ప్రత్యేకమైనదని మాజీ క్రికెటర్ సూచించాడు. ఓవరాల్గా స్క్వాడ్ బాగుందని, బ్యాలెన్స్డ్గా వ్యవహరించారని పేర్కొన్నాడు. జట్టులో రవి బిష్ణోయ్ ఎంపికపై మోరే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతని ఎంపికతో జట్టులో వైవిధ్యం నెలకొందన్నాడు. తన అభిప్రాయం ప్రకారం ఇది మంచి టీం అని మోరే చెప్పాడు.