
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 193/2తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా (91: 204 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు), స్టీవ్ స్మిత్ (44: 88 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులతో ఉన్నారు.
అంతకముందు ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 346 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ (83), డేవిడ్ మలాన్ (62) హాఫ్ సెంచరీలతో మెరిశారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఇంకా 153 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది.
శుక్రవారం 233/5తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టుకి తొలి సెషన్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్ మలాన్ జట్టు స్కోరు 251 వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (30), టామ్ (39), స్టువర్ట్ బ్రాడ్ (31) ఫర్వాలేదనిపించారు.
దీంతో ఇంగ్లాండ్ జట్టు 112.3 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ని ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0తో ఇప్పటికే చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టులో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డుని సమం చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజైన శుక్రవారం స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఘనత సాధించడానికి గాను స్టీవ్ స్మిత్కు 111 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (68 ఇన్నింగ్స్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. సిడ్నీ టెస్టుకు ముందు స్టీవ్ స్మిత్కు ఈ మైలురాయిని అందుకోవడానికి 26 పరుగులు అవసరమయ్యాయి.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 53వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్ బౌలింగ్లో సింగిల్ తీయడంతో టెస్టుల్లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. స్టీవ్ స్మిత్ ప్రస్తుతం తన కెరీర్లో 61వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.