సాహాకి కరోనా వైరస్
ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. రెండు పాయింట్లతో పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఆరంభ మ్యాచ్లు ఆడిన వృద్ధిమాన్ సాహా.. ఆ తర్వాత పూర్తిగా రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. డేవిడ్ వార్నర్తో కలిసి ఓపెనింగ్ చేసిన అతడు పూర్తిగా నిరాశపరిచాడు. వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో డేవ్ స్థానంలో సాహాని ఓపెనర్గా ఆడించాలని సన్రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ యోచించింది. అయితే సాహా ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతని స్థానంలో మనీశ్ పాండేని ఓపెనర్గా ఆడించారు. మరుసటి రోజే సాహాకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది.
కరోనా ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది
తాజాగా ఓ జాతీయ మీడియాతో ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ... 'అందరం బయో బబుల్లోనే ఉన్నాం. టీమ్లోని నిబంధనల్ని తూచ తప్పకుండా పాటించాం. బయటివారితో పరిచయం ఏర్పడే అవకాశం లేదు. మమల్ని కచ్చితమైన ప్రోటోకాల్స్ పాటించేలా చేశారు. గదిలోనే ఉండాలి, వ్యక్తిగతంగా ఎవరిని సంప్రదించకూడదు. హ్యాండ్ వాష్, మాస్కులు ఎప్పుడూ దరించాం. కోచ్లు, మేనేజ్మెంట్తో భోజనం చేసేటప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు కూడా మాస్క్లు పెట్టుకునే ఉన్నాం. అయినా టీమ్లో కరోనా పాజిటివ్ కేసు నమోదవడం నన్ను ఆశ్చర్యపరిచింది' అని అన్నాడు.
'భారత్లోని నా స్నేహితుల గురించి ఆలోచిస్తున్నా.. దయచేసి సురక్షితంగా ఉండండి'
ఇంటికి వెళ్లిపోండని చెప్పాడు
'మ్యాచ్, ప్రాక్టీస్ పూర్తయ్యాక అందరం గదులకే పరిమితం అయ్యాం. నేను నా రూములో ఉండగా.. సన్రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు ఒకరు వచ్చి డోర్ కొట్టాడు. నేను వెళ్లి తీయగా.. మన టీమ్లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది అని చెప్పి తదుపరి ఆదేశాల వచ్చే వరకూ గదిలోనే ఉండమని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ వచ్చి డోర్ కొట్టాడు.
ఈసారి మీ లగేజీ సర్దుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లిపోండి అని చెప్పాడు. మాకు మేనేజ్మెంట్ నుంచి వచ్చిన చివరి మాటలు అవే. వృద్ధిమాన్ సాహాకు కరోనా అని తెలియగానే కాస్త ఆందోళన చెందా. అతడికి వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ అర్ధం కావడం లేదు' అని ఖలీల్ చెప్పుకొచ్చాడు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా
'ఐపీఎల్ ప్రొటోకాల్స్ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉండేది. కోల్కతా, చెన్నై క్యాంప్లలో పాజిటివ్ కేసులు వచ్చాయని తెలియగానే మాలో సందేహాలు వ్యక్తమయ్యాయి. కరోనా టెస్టుల్లో నెగటివ్గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం. తర్వాత రెండు రోజులకే సాహా పాజిటివ్గా తేలాడు. గత బుధవారం సాహా చెన్నైతో మ్యాచ్ ఆడాడు. ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే అంతకుముందే అతడు కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచాం. కానీ అనుకోకుండా అతనికి కరోనా సోకినట్లు తేలింది. టోర్నీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాహా వైరస్ బారినపడటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సాహా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పాడు.