సవాల్కు పూర్తిగా సిద్ధమయ్యాం
ప్రస్తుతం ఉన్న 17 మందిలో 13 మంది 2013-14 సీజన్లో ఇక్కడ ఆడారని... అనుభవం గడించిన వీరంతా తప్పకుండా నాణ్యమైన ఆట ఆడతారనే విశ్వాసాన్ని కోహ్లీ వ్యక్తం చేశాడు. ‘ఇక్కడ ఎదురయ్యే సవాల్కు పూర్తిగా సిద్ధమయ్యాం. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయంలో మేం ఎలాంటి భ్రమల్లో లేం. ఆడే విషయంలో కూడా మాకు ఎలాంటి అయోమయం లేదు. సిరీస్ ఆరంభం కానవ్వండి. జనవరి 5న మీకే తెలుస్తుంది. ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు' అని కోహ్లీ తెలిపాడు.
భారత్ ఇప్పటివరకు ఒక్క సిరిస్ కూడా గెలవలేదు
దక్షిణాఫ్రికాలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు తమ ఆట ఎంతో మెరుగైందని కోహ్లీ అన్నాడు. 'గత నాలుగేళ్లు జట్టుగా మేం ఎంతో మారాం. వ్యక్తిగతంగా కూడా ఎత్తుపల్లాలు ఎన్నో చూశా. ఇప్పుడున్న స్థితిలో జట్టు చాలా సౌకర్య వంతంగా ఉంది. ఆటగాళ్లు కూడా రాటుదేలారు' అన్నాడు.
కోహ్లీ-డివిలియర్స్కు మధ్య జరిగే సిరిస్ కాదు
అలాగే ఇది తనకు, డివిలియర్స్కు మధ్య జరిగే సిరీస్ కాదని గుర్తుచేశాడు. ఈ సిరీస్లో ఇద్దరమే ఆడడం లేదని కోహ్లీ చెప్పాడు. తన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సహచరుడంటే తనకు ఎంతో గౌరవమని అన్నాడు. దక్షిణాఫ్రికాలో పిచ్లు ఎక్కువగా పేస్, బౌన్స్తో ఉంటాయనే విషయం తమకు తెలుసని కోహ్లీ అన్నాడు.
గత పర్యటనలో వారి అంచనాలను తారుమారు చేశాం
గత పర్యటనలో జొహన్నెస్బర్గ్లో జరిగిన తొలి టెస్టులో తామెలా ఆడామో ఓసారి గుర్తు చేసుకోవాలని కోహ్లీ ఈ సందర్భంగా అన్నాడు. ‘భారత్లో కాకుండా ఇక్కడి వికెట్ విభిన్నంగా ఉంటుందని తెలుసు. చివరిసారి వచ్చినప్పుడు కూడా ఈ పిచ్ల గురించి, షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో మేం ఇబ్బంది పడతామని మాట్లాడారు. కానీ మేం వారి అంచనాలను తారుమారు చేశాం' అని కోహ్లీ అన్నాడు.
ఈ సిరీస్ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన కోహ్లీ
ఈ సిరీస్ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. 'జట్టులో నాణ్యమైన పేసర్లు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం మంచి సమతుల్యంతో కనబడుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టెస్టు మ్యాచ్లు గెలిచే సామర్థ్యం మా జట్టుకు ఉంది. ప్రస్తుతానికి సెషన్ల వారిగా గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యర్థి జట్టు చరిత్రను పరిగణనలోకి తీసుకోకుండా మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే సరిపోతుంది. విజయాలు వాటంతట అవే వస్తాయి' అని కోహ్లీ అన్నాడు.