
హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్పై అభిమానులు సోషల్ మీడియాలో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే! మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లాండ్ 10 వికెట్లతో తేడాతో ఓడిపోయింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ను ఇంకో టెస్టు మిగిలుండగానే 2-0తో కోల్పోయింది.
ఇంగ్లాండ్ ఓటమిని సమర్ధిస్తూ 'గుర్తుపెట్టుకోండి.. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్కు టెస్ట్ క్రికెట్ అంత ప్రాధాన్యత కాదు. వారి లక్ష్యమంతా వన్డే ప్రపంచకప్ గెలవడమే.. దానిపైనే వారు కసరత్తులు చేస్తున్నారు' అని ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ ఓటమికి మద్దతుగా నిలిస్తే తప్పులేదు కానీ, టెస్టు క్రికెట్ను తక్కువ చేసేలా మాట్లాడటంపై క్రికెట్ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది.
దీంతో 'ఇదో పిచ్చి స్టేట్మెంట్.. ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఓడిపోతుంది. అప్పుడు తెలుస్తోంది నొప్పంటే ఎంటో.. వరల్డ్కప్ లీగ్ దశ నుంచే నిష్క్రమిస్తోంది' అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా... '90ల్లో టెస్ట్ ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ ప్రపంచకప్లు గెలువలేదా? ఇంగ్లండ్ రెండు ఫార్మాట్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.. పీటర్సన్ నుంచి ఓ పిచ్చి వ్యాఖ్య' అని మరొక నెటిజన్ మండిపడ్డాడు.
వెస్టిండిస్తో జరిగిన తొలి టెస్ట్లో 381 పరుగులతో ఇంగ్లాండ్ ఓడిపోగా... 2009 తర్వాత ఇంగ్లాండ్పై వెస్టిండీస్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. మూడో టెస్టు ఫిబ్రవరి 9నుంచి గ్రాస్ ఐలెట్లో జరగనుంది.