లండన్: ఆఖరి టెస్ట్లో ఇండియాను ఓడించి సిరీస్ను డ్రా చేసుకునే అవకాశం ఇంగ్లండ్కు ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. మొతేరా మైదానం వేదికగానే గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఖరి మ్యాచ్లో పిచ్లో పెద్దగా మార్పులుండవని స్పష్టం చేశాడు. ఇక మొతేరాలోనే జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ 2-1తో సిరీస్లో వెనుకబడింది. అయితే ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయాలని పీటర్సన్ సూచించాడు. ఓ మీడియా వైబ్సైట్కు రాసిన బ్లాగ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు.
'చివరి మ్యాచ్లో పిచ్ ఫ్లాట్గా ఉంటుందని నేను అనుకోవడం లేదు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బాగా బ్యాటింగ్ చేస్తే.. పరిస్థితుల్ని ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. భారత్లో వైఫల్యానికి ఇంగ్లండ్ యువ బ్యాట్స్మెన్ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికిది తొలి పర్యటన. ఇది వారికి మంచి అనుభవం వలే ఉంటుంది. ఇప్పటికే ఓడిపోయిన మ్యాచ్ల గురించి ఆందోళన చెందకుండా, తర్వాతి మ్యాచ్లో విజయం సాధించడంపై ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడాలేనా?మెరుగవ్వాలంటే ఇంకేం చేయాలనే విషయాలపై దృష్టిసారించాలి' అని పీటర్సన్ సూచించాడు.
ఇక, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 277 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాక రెండో టెస్టులో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్బాల్ టెస్టులోనూ పది వికెట్లతో ఘన విజయం సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక భారత్ ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ బెర్త ఖారారు చేసుకోగా.. భారత్ చేరువలో ఉంది. జూన్ లార్డ్స్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.