
హైదరాబాద్: యాషెస్ సిరిస్ అంటేనే చాలు ఆట ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు సైతం ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. ఇక ప్లేయర్లు అయితే ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి మైదానంలో కవ్వింపులకు దిగుతారు. మైదానం బయట మాజీ క్రికెటర్లు తమ తమ జట్లకు మద్దతుగా మాట్లాడుతుంటారు.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ను ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ ట్విట్టర్ వేదికగా కవ్వించాడు.
దీంతో జాన్సన్ తీరు పట్ల నొచ్చుకున్న పీటర్సన్ అతడిని ట్విట్టర్లో బ్లాక్ చేశాడు. 'నిన్న ఫాస్ట్ బౌలర్లు 140 కి.మీ. పైగా వేగంతో బంతులు విసిరారు. కానీ రెండో కొంత బంతిని తీసుకున్నాక వారు మీడియం పేస్కే పరిమితం అయ్యారు' అంటూ ఇంగ్లాండ్ బౌలర్లను ఉద్దేశించి పీటర్సన్, మైకెల్ వాన్ను ట్యాగ్ చేస్తూ జాన్సన్ ట్వీట్ చేశాడు.
ఆ మరుసటి రోజు పీటర్సన్ జాన్సన్కు తిరుగు సమాధానమిచ్చాడు. 'ఈ ట్వీట్ చేసేది నువ్వేనా? లేదా నీ మేనేజ్మెంట్ చేస్తోందా..? ఒకవేళ నువ్వే చేస్తే మాత్రం అది నీకు ఎంత మాత్రం ఉపయోగపడదు. నీ మేనేజ్మెంట్ చేస్తే వెంటనే ఆపేయమను' అని బదులిచ్చాడు. దీనికి గుడ్ రెస్పాన్స్ అంటూ జాన్సన్ బదులిచ్చాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ... జాన్సన్ను, పీటర్సన్ ట్విటర్లో బ్లాక్ చేశాడు. దీంతో తనను పీటర్సన్ బ్లాక్ చేశాడని అందుకు సంబంధించిన ట్వీట్ను జాన్సన్ జత చేసి మరీ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అడిలైడ్ ఓవల్ వేదికగా శనివారం ప్రారంభం కానుంది.