విలియమ్స్ నోట్బుక్ సంబరాలు:
క్రికెట్ నెట్వర్క్ 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్ విలియమ్స్ మొత్తం ఎపిసోడ్ను వివరించాడు. 'జమైకాలో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పుడు.. తొలిసారి నోట్బుక్ సంబరాలు జరుపుకొన్నా. అది అభిమానుల కోసం చేసిందే. కానీ కోహ్లీ మాత్రం ఆ కోణంలో చూడలేదు. మ్యాచ్ అయ్యాక అతడికి షేక్హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ బౌలింగ్ బాగుందన్నాడు. ఆ సమయంలో కోహ్లీ అసభ్యంగా ప్రవర్తించలేదు. అది అంతటితో ముగిసింది' అని విలియమ్స్ తెలిపాడు. కోహ్లీకి వ్యతిరేకంగా ఆడటం చాలా బాగుంది, అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అని నేను కూడా అనుకున్నానన్నాడు.
నోరు మూసుకొని బ్యాటింగ్ చెయ్:
'2019లో విండీస్ జట్టు భారత పర్యటనకు రాగా.. హైదరాబాద్లో జరిగిన తొలి టీ20లో కోహ్లీ క్రీజులోకి వస్తూనే ఈ రాత్రి నీ నోట్బుక్ సంబరాలకు నేను అవకాశం ఇవ్వనని నాతో అన్నాడు. అలా ప్రతీ బంతికి ఏదో ఒకటి అంటూనే నన్ను రెచ్చగొట్టాడు. అందుకే.. 'ఫ్రెండ్, నోరు మూసుకొని బ్యాటింగ్ కొనసాగించు. నీ ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉంది అని చెప్పా. కానీ కోహ్లీ అందులో సగమే విన్నాడు' అని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ పేర్కొన్నాడు.
రెండు ఓవర్లు వేసి కట్టడి చేశా:
'ఆ రాత్రి విరాట్ నన్ను లక్ష్యంగా చేసుకుని చితక్కొట్టాడు. ఆ క్రమంలోనే నా శైలిని అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు భారతదేశమంతా వార్తాపత్రికలలో ఆ సెలబ్రేషన్ గురించే రాసారు. అయితే నేను ఒక సవాలును ఇష్టపడుతున్నా, ఒక సవాలును ప్రేమిస్తున్నా అనుకున్నా. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అని నా మనసులో అనుకున్నా. తదుపరి మ్యాచ్ కోసం విమానంలో తిరువనంతపురానికి వెళ్తున్న సమయంలో.. నావైపు చూస్తూ మరోసారి చేతులు ఊపాడు. ఆ మరుసటి రోజు మ్యాచ్ జరిగే సమయంలో కోహ్లీ బౌండరీ వద్ద కూర్చుని బ్యాటింగ్కు సిద్ధమవుతున్నాడు. నేను ఫైన్-లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. నేను అతనిని చూసిన ప్రతిసారీ అలానే (సెలబ్రేషన్) చేసాడు. ఆ తర్వాత అతడు క్రీజులోకి వచ్చిన తర్వాత రెండు ఓవర్లు వేసి కట్టడి చేశా' అని విలియమ్స్ చెప్పుకొచ్చాడు.
లాంగాన్లో సిక్సర్:
ఆ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... గత వెస్టిండీస్ పర్యటనలో తనని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసిన సెలబ్రేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. కోహ్లీ క్రీజులో ఉన్నాడు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్ రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లీ నేరుగా బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్లో సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టిన తర్వాత విలియమ్స్కు కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. కోహ్లీ తన జేబులో నుంచి నోట్బుక్ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు.
భారత్ ఘన విజయం:
హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హెట్మెయిర్ (56), లూయిస్ (40) రాణించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ (94*) చెలరేగగా.. రాహుల్ (62) రాణించాడు.