కెప్టెన్ కావాలనుకుంటున్నా:
తాజాగా కేశవ్ మహరాజ్ స్పోర్ట్ 24తో మాట్లాడుతూ... 'నేను ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో డాల్ఫిన్స్ జట్టుకు కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నా. గత సీజన్లో నాకు అవకాశం లభించినప్పటి నుండి కెప్టెన్సీని ఆస్వాదించా. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వాహించాలనేదే నా కల. ప్రపంచకప్ నెగ్గి దేశానికి గర్వంగా చూపాలనుకుంటున్నా. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కొందరు మాత్రం కెప్టెన్సీ గురించి నాతొ చర్చించినప్పుడు వారికి మాత్రం నా మనసులోని మాటను చెప్పా' అని మహరాజ్ తెలిపాడు.
డాల్ఫిన్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు:
కేశవ్ మహరాజ్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో డాల్ఫిన్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన వన్డే కప్లో అతడి సారథ్యంలోనే డాల్ఫిన్స్ జట్టు కప్ కూడా గెలుచుకుంది. గత ఫిబ్రవరిలో ఫాఫ్ డు ప్లెసిస్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో క్వింటన్ డీకాక్కు వన్డే, టీ20 బాధ్యతలను క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) అప్పగించింది. అయితే టెస్ట్ జట్టుకు మాత్రం ఇంకా కెప్టెన్ను ఎంపిక చేయలేదు. కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికా తరఫున 30 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు.
మహరాజ్ అరుదైన ఘనత:
2018లో శ్రీలంక పర్యటనలో కేశవ్ మహరాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఈ సఫారీ స్పిన్నర్ 9 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్ట్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్గా రికార్డు సాధించాడు. 61 ఏళ్ల తర్వాత ఈ రికార్డును కేశవ్ అందుకోవడం విశేషం. మరోవైపు లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. 1957లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ హగ్ టైఫీల్డ్ ఈ ఘనతను సాధించాడు.
మహారాజ్ వాళ్ల పూర్వీకులది ఇండియానే:
గతేడాది విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో తన కుమారుడి ప్రదర్శనను వీక్షించేందుకు గాను దక్షిణాఫ్రికా నుంచి కేశవ్ మహారాజ్ తల్లిదండ్రులు ఇండియాకు వచ్చారు. నిజానికి కేశవ్ మహారాజ్ వాళ్ల పూర్వీకులది ఇండియానే. కొన్నేళ్ల క్రితం వారు దక్షిణాఫ్రికాకు వలస వచ్చారు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని తన పూర్వీకుల భూమిలో తన కుమారుడు తొలి టెస్టు ఆడటం ఎంతో సంతోషంగా ఉందని కేశవ్ మహారాజ్ తండ్రి ఆత్మానంద్ మహారాజ్ తెలిపారు. ఆత్మానంద్ మహారాజ్ తన భార్య కంచన్, కాబోయే కోడలు లారిషాలతో కలిసి విశాఖ టెస్టుకు హాజరయ్యారు.