

హైదరాబాద్: కేదార్ జాదవ్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్-ఏ లీగ్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్ అద్భుతంగా రాణించి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.
అయితే ఇప్పుడు ఏంటంటా? అంటారా అదే కేదార్ జాదవ్ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్విట్టర్ మాటల యుద్ధానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.... గత బుధవారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొమ్మిది ఓవర్లు వేసిన కేదార్ జాదవ్... మూడు వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చాడు.
అందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జాదవ్ బౌలింగ్ యాక్షన్ చాలా నెమ్మదిగా ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని సినీ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య తన ట్విట్టర్లో 'కేదార్ జాదవ్ బౌలింగ్ యాక్షన్ చాలా లోగా ఉంది. అయినప్పటికీ మన రూపాయి విలువ కంటే తక్కువైతే లేదు' అంటూ ట్వీట్ చేసింది.
రమ్య ట్వీట్కు కర్ణాటక బీజేపీ ట్విట్టర్లో కాస్తంత ఘాటుగానే స్పందించింది. 'కేదావ్ జాదవ్ బౌలింగ్ యాక్షన్ గురించి అయితే తెలియదు గానీ, మీ ఐక్యూ, పాకిస్థాన్ జట్టు ప్రదర్శన కంటే చాలా తక్కువగా ఉంది' అంటూ ట్వీట్ చేసింది.