హైదరాబాద్: జట్టులో ఆడకపోయినా అతని పేరు ఆటలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఐదు పరుగుల లక్ష్య చేధన ఉన్న సమయంలో మిగిలి ఉన్న ఆఖరి బంతిని ఆడే సమయానికి తడబాటుకు లోనవలేదు. దినేశ్ కార్తీక్ ప్రశాంతంగా వచ్చే బాల్ను అంచనా వేసి సిక్స్ బౌండరీకి పంపాడు. దాంతో జట్టుకు విజయం చేకూరడంతో పాటు.. ట్రోఫీ కూడా దక్కింది.
ఈ ఇన్నింగ్స్లో కార్తీక్ 8 బంతుల్లోనే 29 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2006లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన కార్తీక్.. ఇప్పటి వరకూ కేవలం 19 మ్యాచ్ ల్లోనే బరిలో దిగాడు. భారత జట్టులో ధోనీ పాతుకుపోవడంతో ఇతడికి అవకాశాలు లభించలేదు. 17 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్కు దిగిన అతడు గతంలో ఎన్నడూ లేని రీతిలో కొలంబో టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కార్తీక్ ఏ మాత్రం రెండో ఆలోచనకు తావివ్వకుండా బౌండరీల మోత మోగించాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు.
ఇలాంటి ఆటతీరును ఆడటం ఎలా సాధ్యమైందని మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ను ప్రశ్నించగా.. ఈ తరహా ఆటను ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటం అనుభవం వల్లే సాధ్యమైందని కార్తీక్ చెప్పాడు. తీవ్ర ఉత్కంఠలోనూ ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్ ను ఎలా ముగించాలో ధోనీని చూసి నేర్చుకున్నానని చెప్పాడు. గత కొన్నాళ్లుగా భారీ షాట్లు ఆడటం కసరత్తు చేస్తున్నానని, సపోర్టింగ్ స్టాఫ్ తనకెంతగానో సహకరించారని కార్తీక్ చెప్పుకొచ్చాడు.