
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక విజయ సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ సిరీస్లో ఒక మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించిన కర్ణాటక ఫైనల్లో కూడా నెగ్గి ట్రోఫీని కైవసం చేసుకుంది. కర్ణాటక జట్టు ఈ ట్రోఫీని కైవసం చేసుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులు చేసి ఆలౌటైంది.
కర్ణాటక బ్యాట్స్మెన్లలో ఓవనర్ మయాంక అగర్వాల్(90), రవికుమార్ సామ్రాట్(48), పవన్ దేశ్పాండే(49) అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్లో తన అద్భుత ఇన్నింగ్స్తో మయాంక అగర్వాల్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్లో మయాంక అగర్వాల్ అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తం 2,141 పరుగులు నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు. అతను 2015-16 సీజన్లో ఈ రికార్డు నెలకొల్పాడు.
తాజాగా ఆ రికార్డుని మయాంక అగర్వాల్ అధిగమించాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 109, 84, 28, 102, 89, 140, 81, 90 పరుగుల వరద పారించాడు. అనంతరం 254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టులో కెప్టెన్ పుజారా(94; 10 ఫోర్లు, ఒక సిక్సు) మినహా మిగితా ఆటగాళ్లు ఎవరూ గొప్పగా రాణించలేదు.
కర్ణాటక బౌలర్ల ధాటికి మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో 46.3 ఓవర్లలో 212 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌటైంది. కర్ణాటక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మయాంక అగర్వాల్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. మరోవైపు కర్ణాటక విజయం సాధించిన అనంతరం ఆ జట్టు పేసర్ శ్రీశాంత్ అరవింద్ ఫస్ట్ క్లాస్, ఇండియా-ఏ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో సింగిల్ తీద్దామనుకునే క్రమంలో పుజారా... కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరడంతో మ్యాచ్ ముగిసింది. విజయ్ హజారే ట్రోఫీ అనంతరం మార్చి 5 నుంచి ధర్మశాల వేదికగా ఇండియా ఏ, ఇండయా బి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.