న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రయోగాలు చేయాలని భారత దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ సూచించాడు. ఏ ఆటగాడైనా రెండేళ్లలో గేమ్ను మార్చుకోవచ్చని, అందుకు హార్దిక్ పాండ్యానే ఉదాహరణ అని తెలిపాడు. జట్టులో హార్దిక్ లాంటి మరో ఇద్దరు ఆటగాళ్లు ఉంటే ఇంకా పటిష్టంగా తయారవుతుందన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రయోగాలు చేసేందుకు టీమిండియా జంకుతోందని, దాని నుంచి బయటపడాలని సూచించాడు.
'మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ను ధాటిగా కొనసాగించేందుకు ఇద్దరు నుంచి ముగ్గురు ప్లేయర్లు ఉండాలి. హార్దిక్ పాండ్యా రూపంలో ఓ ఆటగాడు సిద్ధమయ్యాడు. టీ20ల్లో అతన్ని నాలుగో ప్లేస్లో ఆడించాలి. పొట్టి ఫార్మాట్లో ప్రయోగాలు చేస్తూ ఉండాలి. మయాంక్ అగర్వాల్, సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్లను కెప్టెన్తోపాటు మేనేజ్మెంట్ బ్యాకప్ చేయాలి. టీ20 ఫార్మాట్ యువ ఆటగాళ్లది కాబట్టి వాళ్లపై నమ్మకం ఉంచాలి. ఇన్నాళ్లుగా ఐపీఎల్లో ఆడుతున్నా.. ఆ ఫార్మాట్లో ప్రయోగాలు చేయడానికి మనం వెనుకంజ వేస్తున్నాం. టీ20ల్లో భయం లేకుండా ఆడొచ్చు. యువత అలాగే ఆడాలి కూడా. ఐపీఎల్ను మనం మరింతగా వాడుకోవాల్సి అవసరం ఉంది' అని కపిల్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఆస్ట్రేలియా గడ్డపై హార్దిక్ పాండ్యా బ్యాట్తో మెరిసిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ కోహ్లీ సేన 2-1తో కోల్పోయినా పాండ్యా అద్భుత ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం పొట్టి సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకోవడం కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు.