అంత గొప్ప ఆట నా లైఫ్ లో చూడలే..
'ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్, వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తి సిరీస్కు అందుబాటులో లేరు. పైగా జట్టులో సగం కంటే ఎక్కువ మంది ప్లేయర్లు గాయపడ్డారు. షమీ, అశ్విన్, జడేజా, విహారి, ఉమేశ్, బుమ్రా వరుసగా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా పుంజుకొని అంత గొప్పగా ఆడిన భారత జట్టుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నా జీవితంలోనే అంత గొప్ప ఆటను చూడలేదు' అని కపిల్ చెప్పుకొచ్చాడు.
ముగ్గురు కెప్టెన్లు అనవసరం..
భారత జట్టుకు ఫార్మాట్కు ఓ కెప్టెన్ చొప్పున ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదని కపిల్ స్పష్టం చేశాడు. 'వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటూ దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ, మన దగ్గర మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ల సూత్రం సత్ఫలితాలనిస్తుందని నేననుకోను. అంత అవసరం కూడా లేదనుకుంటున్నా. ఎందుకంటే కోహ్లీ లేనప్పుడు అతని పాత్రను రోహిత్, రహానె సమర్ధవంతంగా పోషిస్తున్నప్పుడు ముగ్గురు కెప్టెన్ల ప్రస్తావన అనవసరం.'అని కపిల్ పేర్కొన్నాడు.
సిరాజ్ మరో ఐదేళ్లు రాణించాలి
ఆసీస్ టూర్లో సిరాజ్ ఆకట్టుకున్నాడని లెజెండరీ క్రికెటర్ అన్నాడు. కానీ, తను మరో ఐదు సీజన్లు ఇలానే పెర్ఫామ్ చేయాలన్నాడు. ఫాస్ట్ బౌలర్లు త్వరగా గాయాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. గత పదేళ్లలో బుమ్రా, భువనేశ్వర్, షమీ వంటి చాలా మంది పేసర్లు వెలుగులోకి వచ్చారన్నాడు. కానీ, ఏదో ఒకటైమ్లో గాయపడ్డారని చెప్పాడు. భారత జట్టులో చాలా మంది యంగ్స్టర్స్ వెలుగులోకి వస్తున్నారని కపిల్ అన్నాడు. 'మా జనరేషన్లో గుండప్ప విశ్వనాథ్, గావస్కర్ ఆ తర్వాత సచిన్, రాహుల్ ద్రవిడ్ యంగ్స్టర్స్గా టీమ్లోకి వచ్చి అద్భుతంగా ఆడారు. ప్రస్తుత టీమ్లో శుభ్మన్ గిల్, సుందర్, పృథ్వీ షా నన్ను ఆకట్టుకున్నారు. సుందర్ నుంచి అలాంటి పెర్ఫామెన్స్ నేను ఊహించలేదు. అతనితో పాటు గిల్కు మంచి భవిష్యత్తు ఉంది. పృథ్వీ గత రెండేళ్లలో బాగా రాణించాడు.' అని కపిల్ చెప్పుకొచ్చాడు.
గోల్ఫ్ ప్రకృతికి దగ్గర చేసింది..
గోల్ఫ్, క్రికెట్ ఈ రెండింటిలో ఒక్కటి ఎంచుకోవడం చాలా కష్టమని కపిల్ తెలిపాడు. 'నా బాల్యంలోనే మా అమ్మానాన్న నాకు బ్యాట్, బంతి ఇచ్చి క్రికెట్ను అలవాటు చేశారు. ఆతర్వాత దేశానికి పదిహేనేళ్లు ప్రాతినిథ్యం వహించా. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఒక అరుదైన అనుభూతి. ఎన్నో మధురమైన విజయాలు, జ్ఞాపకాలను నాకు క్రికెట్ అందించింది. గోల్ఫ్ విషయానికొస్తే ఈ క్రీడ నన్ను ప్రకృతికి దగ్గర చేసింది. పచ్చని పరిసరాలు, చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఆ మట్టి వాసన నాకు ఈ క్రీడపై అభిమానాన్ని పెంచింది. నేనుండే ఇంటి చుట్టూ గోల్ఫ్ కోర్టు.. మధ్యలో ఇల్లు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు క్రికెటంటే ప్రాణం.. గోల్ఫ్ అంటే పిచ్చి.'అని తెలిపాడు.