బ్యాటింగ్లో గడ్డు కాలం:
విరాట్ కోహ్లీ గత 20-22 నెలలుగా బ్యాటింగ్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై (డే/నైట్ టెస్ట్) చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70+ పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. టెస్ట్ ఛాంపియన్షిఫ్ ఫైనల్లోనూ రాణించలేదు. ఇంగ్లండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్లో కూడా నిరాశపరిచాడు. 71వ శతకం అందుకోవడానికి కోహ్లీకి గగనం అయిపొయింది. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు.
23 వేల పరుగులు:
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 96 టెస్టులాడి 51.1 సగటుతో 7765 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులో అత్యధిక స్కోర్ 254 నాటౌట్. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగుల మార్కును ఇటీవలే అందుకున్నాడు. 23వేల పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్మన్గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లీ ఇప్పటివరకు 440 మ్యాచ్ల్లో 490 ఇన్నింగ్స్లలో 23 వేల పరుగులు చేశాడు. అతని సగటు 55.28గా ఉంది.
ట్రిపుల్ సెంచరీ బాదగలడు:
అన్కట్ షోలో కపిల్ దేవ్ మాట్లాడుతూ... 'కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విరాట్ కోహ్లీ భారీ స్కోర్లు నమోదు చేసినప్పుడు ఎవరూ అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడలేదు. గత కొద్దికాలంగా సెంచరీలు బాదలేకపోవడంతో.. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్పై దృష్టి పెట్టలేకపోతున్నాడని అంటున్నారు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపల్లాలుంటాయి. ప్రస్తుతం కోహ్లీలో అద్భుతమైన పరిణతి కనిపిస్తోంది. అతడు మునుపటి ఫామ్ను అందుకుంటే.. సెంచరీనే కాదు ట్రిపుల్ సెంచరీ బాదగలడు. అతడి ఫిట్నెస్పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుని.. భారీ స్కోర్లపై దృష్టి సారించాలి' అని అన్నాడు.
శతకం నమోదు చేయకపోయినా:
విరాట్ కోహ్లీ గ్రాఫ్ ప్రస్తుతం సరిగాలేదు, అయితే అది ఎంతో కాలం ఉండదని కపిల్ దేవ్ అన్నాడు. 28 నుంచి 32 వరకు పరిణతి చెందే వయసుని, కోహ్లీ ఇప్పుడు బాగున్నాడన్నాడు. కోహ్లీ కచ్చితంగా డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేస్తాడని కపిల్ ధీమా వ్యక్తం చేశాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా కోహ్లీ శతకం నమోదు చేయకపోయినా సగటు మాత్రం మెరుగ్గానే ఉంది. వన్డేల్లో 46.66, టీ20ల్లో 52.60 సగటుతో అతడు కొనసాగుతుండటం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచుల కోసం యూఏఈ చేరుకున్నాడు. గత ఆదివారం యూఏఈ చేరుకున్న బెంగళూరు కెప్టెన్ ప్రస్తుతం క్వారంటైన్ సమయం గడుపుతున్నాడు.