విరామం జోలికి పోకూడదు
ఆసియా కప్ 2022 కోహ్లీకి చివరి అవకాశమా అని ఓ విలేకరి కపిల్దేవ్ను అడగగా.. 'నేను అలా ఏం అనుకోను. అసలు మనం దాని గురించి ఆలోచించనే వద్దు. మనం కోహ్లీకి ఇదే చివరి అవకాశమా తదితర వ్యాఖ్యలనే వాడొద్దు. అది సరికాదు. అతను రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతూనే ఉండాలి. అదే నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను.
అతి విరామం కూడా పనికిరాదు. అతను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్. అతను ఫామ్ పుంజుకునేదాకా విరామం జోలికి పోకూడదు. అతను ఎన్ని మ్యాచ్లు ఆడగలడని భావిస్తే అన్ని మ్యాచ్లు ఆడాలి అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అతను ఒక్కసారి ఫ్రీగా పరుగులు చేయడం ప్రారంభించినప్పుడు.. తప్పకుండా అతని బ్యాటింగ్ వ్యూ మారుతుంది' అని కపిల్ దేవ్ చెప్పాడు.
ఇది భారత క్రికెట్కు ఆరోగ్యకరం
ఇకపోతే కపిల్ తన హయానికి భిన్నమైన వాతావరణం ప్రస్తుతం టీమిండియాలో ఉందని పేర్కొన్నాడు. ఈ రోజు ప్రభావవంతమైన ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అది జట్టుకు మంచిదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి సీనియర్లు విశ్రాంతి తీసుకున్నప్పుడు యువకులకు అవకాశం దొరుకుతుంది. సంజూ శాంసన్, దీపక్ హుడా, శుభ్మన్ గిల్ లాంటి వారు తమకు అవకాశాలొచ్చినప్పుడు మంచి ప్రభావవంతంగా ఆడారు. ఈ ప్రక్రియ ఇలాగే ముందుకు సాగాలని ఇది భారత క్రికెట్కు ఆరోగ్యకరమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పుడు చాలా మార్పు వచ్చింది
'ప్రస్తుతం టీంలో ఆ ప్లేయర్ కచ్చితంగా ఉండాలి లేకపోతే నడవదు అనే పరిస్థితి లేదు. ఈరోజు టీమ్లో ఎవరు లేరన్న తేడా లేదు. మా కాలంలో పెద్ద ఆటగాడు టీంలో ఉండాలి.. అతను ఆడాలి.. లేకుంటే అతనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కోహ్లీ, రోహిత్ లేదా అశ్విన్ లాంటి పెద్ద ప్లేయర్లు బెంచ్ ప్లేయర్లుగా ఉన్నా.. లేదా విశ్రాంతి తీసుకున్నా సరే.. బరిలోకి దిగే ఆటగాళ్లు అస్సలు భయం లేకుండా ఆడుతున్నారు. ఆటగాళ్ల ఆలోచనా విధానం చాలా బాగా మారింది. స్టార్లు లేరు కదా ఇప్పుడెలా అనే ధోరణి అసలే లేదు. జట్టులో ఎవరుంటారో వాళ్లే అత్యుత్తమంగా ఆటను చూసుకుంటున్నారు.' అని కపిల్ పేర్కొన్నాడు.