హైదరాబాద్: వ్యక్తిగత అహం భారత మహిళల క్రికెట్ వృద్ధికి అవరోధంగా మారుతోందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఇటీవల భారత మహిళల జట్టు కోచ్ నియామకం కోసం అభ్యర్థులకి కపిల్దేవ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి చివరకు డబ్ల్యూవీ రామన్ని కోచ్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
కోచ్ను ప్రకటించేసిన బీసీసీఐ .., ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే..
అయితే, సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం రామన్ ఎంపికని తప్పుబడుతూ కోచ్గా రమేశ్ పొవార్ని ఎంపిక చేయాలని కోరుతూ కపిల్దేవ్ కమిటీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్.. రామన్ ఎంపికని సమర్థిస్తూ సంతకం చేయగా, ఎడుల్జీ మాత్రం సంతకం చేయకుండా ఆలస్యం చేసింది.
ఈ విషయం తెలిసిన కపిల్ దేవ్ తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో "మహిళల జట్టు కోచ్ నియామకంపై చెలరేగిన వివాదం నన్ను చాలా బాధించింది. ఇక్కడ ఎవరి పేరునీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. వ్యక్తిగత అహం, దేశంలో మహిళల క్రికెట్ వృద్ధికి అవరోధంగా మారుతోంది. ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టా అయిష్టాలు ఉంటాయి. వాటిని జట్టుపై రుద్దడం సమంజసం కాదు" అని అన్నాడు.
కోచ్గా రమేశ్ పొవార్ పదవీకాలం ముగియడంతో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మళ్లీ కోచ్గా రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ టీ20 ప్రపంచకప్లో కీలకమైన సెమీస్ మ్యాచ్లో మిథాలీ రాజ్ని పక్కన పెట్టడం, ఆ తర్వాత మిథాలీ-పొవార్ మధ్య నెలకొన్న వివాదం భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చిందని బీసీసీఐ భావించింది.
దీంతో రెండోసారి కోచ్ పదవికి అతను దరఖాస్తు చేసుకున్నా బీసీసీఐ అవకాశం ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. ప్లేయర్లకు, కోచ్కు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా భావించిన బోర్డు కొత్త కోచ్ ఎంపికకే మొగ్గు చూపించింది.