పరుగులు చేయటానికి ప్రయత్నించు:
తాజాగా కపిల్ దేవ్ మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ నిరుత్సాహపడకూడదు. అవకాశాలు తప్పకుండా వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విమర్శకులకు తన ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలి. పంత్కు మంచి భవిష్యత్తు ఉంది. సెంచరీ సాధించాలనుకుంటే ముందుగా 20 పరుగులు చేయటానికి ప్రయత్నించు.. ఆ తర్వాత 20, 30, 50, 70 చేస్తూ సెంచరీ సాధించు అని సునిల్ గావస్కర్ చెబుతుండేవాడు. పంత్ కూడా ఈ తరహా ఆలోచనతోనే బ్యాటింగ్ చేయాలి' అని అన్నారు.
పంత్ను ఎవరూ ఆపలేరు:
'భారీ ఇన్నింగ్స్ ఆలోచనతో పంత్ బరిలోకి దిగకూడదు. 5-10 మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భావించాలి. అప్పుడే బాగా ఆడగలడు. పంత్ మంచి ప్రదర్శన చేస్తే.. అతడిని ఎవరూ ఆపలేరు. ఓపెనర్గా వచ్చినా, పదో స్థానంలో బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఉత్తమ ప్రదర్శన చేయాలి. స్థానంతో సంబంధం లేకుండా ఆడాలి. అతడిపై కొన్ని బాధ్యతలు ఉన్నాయి' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
స్పెసలిస్ట్ కీపర్ ఉండాలి:
'రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం కొంచెం విచిత్రంగా ఉంది. అయితే ఇలా సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. రాహుల్ ద్రవిడ్ గతంలో ఇలానే చేశాడు. కానీ.. ప్రస్తుతం స్పెసలిస్ట్ వికెట్ కీపర్ ఉండాలి. ప్రస్తుతం జట్టు యాజమాన్యం భిన్నంగా ఆలోచిస్తోంది. బయట కూర్చొని ఏదైనా చెప్పడం మనకి సులభం' అని కపిల్ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో పంత్కు ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కంకషన్కు గురైన పంత్.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్ ధోనీకి కీలకం:
'చాలా కాలం క్రికెట్కు దూరమైతే తిరిగి పునరాగమనం చేయడం ఎవరికైనా చాలా కష్టం. కానీ.. ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ లాంటి టోర్నీతో మంచి అవకాశం ముందుంది. మహీకి ఐపీఎల్ ఎంతో కీలకం. అయితే భారత సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలి. ధోనీ దేశం తరఫున ఎన్నో సాధించాడు. కానీ.. 6-7 నెలలు క్రికెట్కు దూరమై అందరిలోనూ తన భవితవ్యంపై సందేహాలు రేకెత్తించాడు. దీంతో అనవసర చర్చలు సాగుతున్నాయి' అని కపిల్ అన్నారు.