ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ నివాసంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో నుంచి మేకను ఎత్తుకెళ్లారు. దాని విలువ 90,000 రూపాయలు. బక్రీద్ సందర్భంగా పేదలకు దానం ఇవ్వడానికి మేకలను కొనుగోలు చేయగా.. అందులో ఒకదాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయాన్ని కమ్రన్ అక్మల్ తండ్రి వెల్లడించారు. లాహోర్లోని ఓ రెసిడెన్సియల్ సొసైటీలో అక్మల్ తన కుటుంబంతో కలిసి నివసిస్తోన్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని మొత్తం ఆరు మేకలను కొనుగోలు చేసి, ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశామని, అందులో ఒకటి కనిపించట్లేదని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సాధారణంగా బక్రీద్ సమయంలో ముస్లింలు.. ఖుర్బానీ ఇవ్వడానికి మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ ఖుర్బానీ కోసమే వాటిని మేపుతుంటారు. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ.
ఈ పండుగ సమయంలో ఖుర్బానీ మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల ధర లక్షల రూపాయల మేర పలుకుతుంటుంది. ఆరు లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసిన కమ్రన్ అక్మల్ ఆరు మేకలు, గొర్రెలను కొనుగోలు చేశారు. కాగా- భారత్లో జులై 10వ తేదీన బక్రీద్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆరు ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, ఈజిప్ట్, ఒమన్..శనివారమే బక్రీద్ పండుగను జరుపుకోనున్నట్లు ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
కమ్రన్ అక్మల్ పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మట్ల క్రికెట్ ఆడాడు. టెస్టులు-53, వన్డే ఇంటర్నేషనల్స్-157, టీ20-58 మ్యాచ్ల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ లీగ్ మ్యాచ్లల్లో పాల్గొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లోనూ మెరిశాడు. 2008 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరు మ్యాచ్లల్లో అక్మల్ ఆడాడు. ఒక అర్ధసెంచరీ సహా 128 పరుగులు చేశాడా టోర్నమెంట్లో.