ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు రవిచంద్రన్ అశ్విన్ మంచి ఫామ్ కనబర్చడం భారత్కు సానుకూలాంశమని పాకిస్థాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్కు అశ్విన్ ఎంపికై తుది జట్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది నెలల విరామం తర్వాత అశ్విన్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. మూడు టీ20ల్లో 6.66ఎకానమీ రేట్తో 24 స్ట్రైక్ రేట్తో 3వికెట్లు తీసి రాణించాడు. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. అశ్విన్ ఫామ్ గురించి అక్మల్ మాట్లాడుతూ.. ఆఫ్స్పిన్నర్ అయిన అశ్విన్ తనను తాను నిరూపించుకునే ప్లేయర్ అని.. అతని ప్రస్తుత ఫామ్ T20ప్రపంచకప్కు ముందు టీమిండియాకు సానుకూలాంశమని చెప్పాడు. అతను బౌలింగ్లో ఉపయోగించిన వైవిధ్యాలు ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు.
'రవిచంద్రన్ అశ్విన్ తనను తాను నిరూపించుకున్న ప్లేయర్. టీ20 ప్రపంచకప్కు ముందు అతని ఫామ్ భారత క్రికెట్కు సానుకూల సంకేతం. తన వేరియేషన్స్తో మరోసారి ఆకట్టుకున్నాడు. అతనికి టీ20 క్రికెట్ ఆడిన అనుభవం చాలా ఉంది. అతనో మ్యాచ్ విన్నర్. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ ఉంటే అది జట్టుకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అలాగే జట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది.' అని అక్మల్ చెప్పాడు.
మూడో టీ20లో భారతదేశం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ని కూడా కమ్రాన్ ప్రశంసించాడు. 'సూర్యకుమార్ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. అద్భుతమైన నాక్ ఆడాడు. అతని షాట్ ఎంపిక చాలా బాగుంది. అవతలి ఎండ్లో శ్రేయాస్ అయ్యర్ ఔట్ కాకుంటే మరింత దూకుడుగా ఆడేవాడు. అతను ఔటయ్యాక అతను కాస్త నెమ్మదిగా ఆడాడు' అని అక్మల్ చెప్పాడు.