హైదరాబాద్: రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన పేసర్ కగిసో రబాడ తర్వాతి రెండు టెస్టులకూ దూరమయ్యాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండుసార్లు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రబాడపై రెండు మ్యాచ్ల నిషేధం విధించారు.
వార్నర్ పట్ల దురుసుగా: రబాడ దూకుడుపై ఐసీసీ మరోసారి కొరడా
రెండో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ను ఔట్ చేసిన అనంతరం అతడి భుజానికి భుజం తాకిస్తూ వెళ్లినందుకు రిఫరీ రబాడ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించాడు. ఇక, రెండో ఇన్నింగ్స్లో కూడా రబాడ హద్దులు దాటి ప్రవర్తించాడు.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటైన తర్వాత అతడని పెవిలియన్కు పంపే క్రమంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడు. దీంతో రబాడ ఖాతాలో మొత్తం ఎనిమిది డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు డీమెరిట్ పాయింట్లు ఏదైనా ఆటగాడి ఖాతాలో ఉంటే అతడిపై నిషేధం విధిస్తారు.
దీంతో రబాడపై రెండు టెస్టు మ్యాచ్ల నిషేధం పడింది. రబాడ విషయంలో మ్యాచ్ రిఫరీ కఠినంగా వ్యవహరించాడని భావిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతడిపై పడ్డ సస్పెన్షన్ విషయంలో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇరు జట్ల చెరో టెస్టు నెగ్గడంతో సిరిస్ రసవత్తరంగా మారింది.
దీంతో అద్భుతమైన ఫామ్లో ఉన్న రబాడ చివరి రెండు టెస్టులకు దూరం కావడం దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బే. తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 22న కేప్టౌన్ వేదికగా జరగనుంది.