59 బంతుల్లో 99 పరుగులు:
న్యూజిలాండ్ బ్యాట్స్మన్ దేవన్ కాన్వే రోజుల వ్యవధిలో ఐపీఎల్ 2021 ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అంతేకాదు కోట్ల రూపాయల్ని సంపాదించే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కాన్వే చెలరేగాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఐపీఎల్ 2021 వేలంలో ఈ ఆటగాడు అమ్ముడుపోలేదు. అతని కనీస ధర 50 లక్షల రూపాయలు ఉన్నా ఎవరూ తీసుకోలేదు. అయితే ఆసీస్తో ఆడిన ఇన్నింగ్స్ వేలానికి ముందే ఆడుంటే.. అతనికి కోట్లు దక్కేవి. ఇదే విషయాన్ని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
|
కాన్వే.. నాలుగు రోజులు ఆలస్యమైంది:
దేవన్ కాన్వే సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు. 'కాన్వే.. నాలుగు రోజులు ఆలస్యమైంది. కానీ మంచి ఇన్నింగ్స్ ఆడావ్' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఓ ఎమోజీని కూడా ఆడ్ చేశాడు. ఏ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 'వేలంలో కాన్వేను తీసుకోని ప్రాంఛైజీలను ఓసారి ఊహించుకోండి. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు' అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఒకవేళ వేలానికి ముందు కాన్వే ఈ తరహా సంచలన ఇన్నింగ్స్ ఏమైనా చేసి ఉంటే.. అతడు కోట్లలో అమ్ముడుపోయేవాడని అశ్విన్ అంటున్నాడు. యాష్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
బెంగళూరుపై ట్రోల్స్:
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. వేలంలో భారీ ధరకి ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ (రూ.14.25 కోట్లు), న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్ (రూ.15 కోట్లు)ని కొనుగోలు చేయడం, ఇద్దరూ తొలి టీ20 మ్యాచ్లో విఫలమవ్వడమే అందుకు కారణం. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన జెమీషన్ 10.70 ఎకానమీతో ఏకంగా 32 పరుగులు ఇవ్వగా.. మాక్స్వెల్ 5 బంతులాడి ఒక పరుగు మాత్రమే చేశాడు. 'మాక్స్వెల్.. సెంచరీని 99 పరుగులతో మిస్ చేసుకున్నాడు', 'బెంగళూరులోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇలానే ఆడతారు' అని సెటైర్లు పేల్చుతున్నారు.
కాన్వే భారీ ఇన్నింగ్స్:
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణించిన కివీస్.. ఆసీస్ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కాన్వే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డేనియల్ సామ్స్, జే రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు కివీస్ బౌలర్లు జలక్ ఇచ్చారు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్లు తొలి 5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీశారు. మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 131 రన్స్కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్.
పేరు లేని బౌలర్లకు అంత ధరనా.. ఉమేశ్తో పోలిస్తే వారి అనుభవం ఎంత: నెహ్రా