ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మినీ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కనీస ధరకే అమ్ముడుపోవడంపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మండిపడ్డాడు. పేరు లేని బౌలర్లకు కోట్లు వెచ్చించి .. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్కు అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదన్నాడు. చెన్నై వేదికగా జరిగిన వేలంలో రూ.కోటితో ఉమేశ్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. భారత అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న ఉమేశ్పై ఢిల్లీ మినహాయిస్తే.. మిగతా ఫ్రాంఛైజీలు పెద్దగా అసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యం కలిగించిందని నెహ్రా పేర్కొన్నాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ... 'ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. 'పేరు లేని బౌలర్లకు అంత వెచ్చించి.. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్ యాదవ్ను అంత తక్కువ ధర ఇవ్వడం బాగాలేదు. నిజానికి జై రిచర్డ్సన్, కైల్ జేమిసన్ ఇంకా నిరూపించుకునే దశలో ఉన్నారు. టెస్టుల పరంగా జేమిసన్ నిలకడగా రాణిస్తున్నాడు. రిచర్డ్సన్ పెర్త్లో ఫర్వాలేదనిపించాడు. కానీ ఉమేశ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఉమేశ్తో పోలిస్తే.. జేమిసన్, రిచర్డ్సన్ అనుభవం ఎంత?. వేలంలో ఎక్కువ ధరకి ఎలా అమ్ముడుపోయారనేది అర్థం కావడం లేదు' అని అన్నాడు.
'ఉమేశ్ యాదవ్ వేలంలో తక్కువ ధరకు అమ్ముడయ్యాడన్న బాధ కన్నా పేరులేని బౌలర్లకు అంత పెట్టినందుకు ఆశ్చర్యం కలిగింది. మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ లాంటి బౌలర్లు భారీ ధరకి అమ్ముడుపోయారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారు తమ సత్తాను ప్రపంచానికి నిరూపించారు. అనుభవజ్ఞుడైన ఉమేష్ యాదవ్ కేవలం ఒక కోటికి మాత్రమే అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ఉమేశ్ను కనీస మద్దతు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా తప్పుబట్టాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్కు ఐపీఎల్ 2021 వేలంలో రూ.16.25 కోట్లకి అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ కోసం రూ.15 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్కు రూ.14 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. రూ.కోటితో ఉమేశ్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఉమేష్ భారత్ తరఫున 48 టెస్టులు, 75 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇక 121 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.
నవ్వుతూ తిరిగొస్తానని నా భార్యకు మాటిచ్చా.. భారత జట్టులోకి ఎంపికయ్యానంటే ఆయనే కారణం: సూర్య