లండన్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులు అందరూ తమవంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం ఇప్పటికే ముందుకొచ్చాడు. కరోనా పై చేస్తున్న పోరాటం కోసం తనకు ఎంతో ఇష్టమైన ప్రపంచకప్ 2019 జెర్సీని బట్లర్ వేలంలో విక్రయించాడు. ఆ జెర్సీకి రూ.60.83 లక్షలు వచ్చాయి. బట్లర్ ప్రపంచకప్ జెర్సీ వేలం మంగళవారం ముగిసింది. మొత్తం 82 బిడ్స్ రాగా.. 65,100 పౌండ్లకు ఒకతను కొనుగోలు చేసాడు.
నాలో కసి ఇంకా అలానే ఉంది.. ఇంకో ప్రపంచకప్ ఆడుతా: ఉతప్ప
వేలంలో వచ్చిన రూ.60.83 లక్షలను లండన్లోని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆస్పత్రుల ఛారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీని బట్లర్ వేలం వేశాడు. ఆ జెర్సీపై తమ జట్టు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఫైనల్లో కివీస్పై ఇంగ్లండ్ తొలిసారిగా ప్రపంచకప్ను ముద్దాడిన విషయం తెలిసిందే.
'ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో నేను ధరించిన జెర్సీని వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్లోని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆస్పత్రులకు అందిస్తాను. కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయండి' అని బట్లర్ ఇదివరకే ట్విటర్లో పేర్కొన్నాడు. విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని వారికి మనవంతు సాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
2019 జులై 14న లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఇరు జట్ల స్కోర్లు, సూపర్ ఓవర్ సమం కావడంతో.. సూపర్ ఓవర్ బౌండరీ లెక్కల ప్రకారం విజేతను నిర్ణయించారు. ఇంగ్లండ్కు ఇదే తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. ఇంగ్లండ్ కప్ గెలవడంతో జోస్ బట్లర్ కూడా కీలక పాత్ర పోషించాడు.